గోపి శీనులకు పీపుల్స్ అండదండలు

ఫామ్ లో ఉన్న హీరో, దర్శకుడు కాంబినేషన్ అయితే బడ్జెట్ లో ఎక్కువ తక్కువలు ఎన్ని జరిగినా ఏదోలా ఫైనాన్స్ సర్దుబాటు జరిగిపోతుంది. కానీ అలా కాకుండా హిట్ చూసి ఏళ్ళు గడిచిపోయిన కాంబోకు అంత సులభంగా క్రేజ్ రాదు. గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయిక ఒకప్పుడు అయితే హాట్ కేకయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ పలు అవాంతరాలు ఎదురుకున్న తర్వాత నిర్మాణ సంస్థ చిత్రాలయ స్టూడియోస్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు తోడవ్వడంతో ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతోంది.

గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు సరైన హిట్ పడలేదు. ఇటీవలే వచ్చిన భీమా సైతం నిరాశ కలిగించే ఫలితాన్ని అందుకుంది. ఎబోవ్ యావరేజ్ ఉన్నా మంచి వసూళ్లు దక్కేవి కానీ రొటీన్ కంటెంట్ ఆడియన్స్ ని నిరాశపరిచింది. ఇక శీను వైట్ల రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ ని ప్లాన్ చేసుకుని సెట్స్ కి వెళ్లకుండానే ఆపేశారు. స్క్రిప్ట్ సరిగా రాలేదో లేక ఇంకేదైనా కారణమో తెలియలేదు. లక్కీగా గోపిచంద్ కు కథ నచ్చడంతో ఇది పట్టాలు ఎక్కేసింది. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వైట్ల మీద ఉంది.

ఒకప్పుడు బ్లాక్ బస్టర్లతో వెలిగిన డైరెక్టర్లు అవుట్ ఫోకస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఛాన్స్ దక్కిన దాఖలాలు తక్కువ. కానీ శ్రీను వైట్లకు దొరికింది. పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నారు. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే తన క్లాసిక్ కామెడీకి కొనసాగింపు వెంకీ 2 తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది కార్యరూపం దాల్చాలంటే గోపీచంద్ తో సక్సెస్ కొట్టడం కంపల్సరీ. ఈ ఏడాదిలోనే విడుదల ప్లాన్ చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. హాస్యం, యాక్షన్ రెండూ మేళవించి కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతానని వైట్ల చెబుతున్నారు.