విక్ర‌మ్ కొడుకు.. క్రేజీ మూవీ

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చేసిన రెండు సినిమాల‌తోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వార‌సుల్లో ధ్రువ్ విక్ర‌మ్ ఒక‌డు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో హీరోగా ప‌రిచ‌య‌మై తొలి మూవీతోనే హిట్ కొట్టిన అత‌ను.. రెండో చిత్రం మ‌హాన్‌లో తండ్రి విక్ర‌మ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఆయ‌న‌కు దీటుగా న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

మ‌హాన్‌లో ధ్రువ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపించాయి. ఈ సినిమా త‌ర్వాత కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డానికి ధ్రువ్ చాలా టైం తీసుకున్నాడు. ఎట్ట‌కేల‌కు దాని గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ధ్రువ్ మూడో చిత్రం క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్క‌బోతోంది.

తొలి చిత్రం ప‌రియేరుం పెరుమాల్‌తో జాతీయ అవార్డు సాధించ‌డ‌మే కాక‌.. ఆ త‌ర్వాత క‌ర్ణ‌న్, మామ‌న్న‌న్ లాంటి క్లాసిక్స్ అందించిన మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ్రువ్ న‌టించ‌బోతున్నాడు. మారి సెల్వ‌రాజ్ గురువైన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు తెచ్చుకున్న ధ్రువ్ ప‌క్క‌న అనుప‌మ మంచి జోడీ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా లాంచ్ చేసిన ప్రి లుక్ పోస్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ మార్కును సూచించేలా ఉంది. అత‌ను మ‌రోసారి బ‌ల‌మైన కాన్సెప్ట్‌తో రాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మారి లాంటి మేటి ద‌ర్శ‌కుడితో జ‌ట్టు క‌ట్టాడంటే ధ్రువ్ పెర్ఫామెన్స్ అదిరిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.