తగ్గేదేలే…ఆగని బన్నీ మైలురాళ్ళు

నిన్న దుబాయ్ మేడం టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణకు అల్లు అర్జున్ స్వయంగా విచ్చేయడం అభిమానులకు ఎక్కడ లేని ఆనందాన్ని కలిగించింది. ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం 20023 తన కెరీర్ మొదలైన గంగోత్రి విడుదల రోజు మార్చి 28నే ఈ సంఘటన జరగడం బన్నీకి మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇలా టాలీవుడ్ నుంచి మైనపు బొమ్మలు ప్రతిష్టించుకునే గౌరవం దక్కించుకున్న ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఐకాన్ స్టార్ నిలవడం ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. దీని తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కేవలం బొమ్మ కోణమనే కాకుండా అల్లు అర్జున్ కు పుష్ప తర్వాత ఒక్కసారిగా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. మహామహులకే సాధ్యం కానీ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని టాలీవుడ్ కు తీసుకొచ్చింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రతినిధిగా పాల్గొనే గౌరవాన్ని ఇచ్చింది. కేరళ లాంటి ప్రాంతీయాభిమానం మెండుగా ఉన్న రాష్ట్రాల్లో ఫాలోయింగ్ అమాంతం పెంచింది. పుష్ప 2 ది రూల్ మీద ఎంత లేదన్నా వెయ్యి కోట్లకు పైగా థియేటర్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయి. బ్రాండ్ ఇమేజ్ సైతం ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది.

తగ్గేదేలే అన్న మాటను నిజం చేస్తూ అల్లు అర్జున్ దూసుకుపోతున్న వైనం నిజంగానే స్ఫూర్తినిచ్చేదే. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు అంతకంతా పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ తో దర్శకుడు సుకుమార్ సినిమా అధికారికంగా ప్రకటించాక కూడా పుష్ప 3 గురించి వార్తలు ఆగడం లేదు. గంగోత్రి హిట్ తో కెరీర్ మొదలై రెండో సినిమా ఆర్యతోనే అదిరిపోయే బ్రేక్ అందుకున్న బన్నీ ఆ తర్వాత రేసు గుర్రం, రుద్రమదేవి, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇప్పుడీ టుస్సాడ్ మైలురాయి ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే.