లాక్ డౌన్ తర్వాత అవన్నీ మిస్సే

ట్రాఫిక్ ను చేధించుకుంటూ.. కాలుష్య వాతావరణంలో చెమటలు చిందిస్తూ.. ఆఫీసుకు వెళ్లటానికి మించిన ఇబ్బంది మరింకేం ఉంటుంది. అందుకు భిన్నంగా మొబైల్ లో బుక్ చేసుకుంటే.. ఇంటి ముందుకే వచ్చే కార్ ఫూలింగ్ సుఖాన్ని ఎన్ని మాటల్లో వర్ణించినా తక్కువే. అంతేనా.. కాస్త ఖాళీ దొరికితే.. మాల్ కు వెళ్లి ఏ మెక్ డొనాల్డ్ లోనో.. కాఫీ షాప్ లోనో కూర్చోవటం.. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలన్నది.. వీక్ మొదట్లో డిసైడ్ చేయటం లాంటివేమీ రానున్న రోజుల్లో ఉండవు.

ఆ మాటకు వస్తే మాయదారి మహమ్మారి పుణ్యమా అని.. జీవితం మొత్తం మారిపోయింది. గతంలో మాదిరి ఫ్రెండ్లీ హగ్ లు ఇచ్చే రోజులు పోవటమే కాదు.. దోస్తులతో చేతులు కలిపే దినాలు కూడా మాయమైనట్లే. అంతేనా.. క్రీమ్ స్టోన్ కు వెళ్లి ఐస్ క్రీంను చప్పరించటం.. అర్థరాత్రి వేళ నేచురల్స్ కు వెళ్లి భారీ క్యూలో మన వరకు వచ్చే దాకా వెయిట్ చేసి.. స్నేహితులతో షేరింగ్ చేసుకుంటూ తినటం లాంటివి గురుతులుగా మారతాయనటంలో సందేహం లేదు.

అంతేనా.. టికెట్ కన్ఫర్మ్ కాకున్నా.. టీసీకి ఏదో ఒకటి చెప్పి అడ్జెస్ట్ కావటం.. ఒకచోటు నుంచి మరో చోటుకు ఏ మాత్రం శ్రమ లేకుండా వెళ్లే మెట్రోలో ప్రయాణం మాత్రమే కాదు.. సొంత వెహికిల్ లేకున్నా.. జేబులో సెల్ ఫోన్ ఉంటే చాలు.. ఏదో ఒక వాహనం వచ్చి మనల్ని పికప్ చేసుకోవటం లాంటి సౌకర్యాలు రానున్న రోజుల్లో కష్టమే.

ఉప్పల్ స్టేడియంలో వేలాది మందితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూడటం.. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కాన్సర్ట్ లో పాల్గొనటం.. మల్టీఫ్లెక్సుల్లో పొద్దున నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సినిమాల్ని చూసే అవకాశం దక్కకపోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే.. లాక్ డౌన్ తర్వాత పరిస్థితుల్లో చాలానే మార్పులు రావటం ఖాయం. ప్రతి ఒక్కరి జీవితం రెండు భాగాల్ని చేసింది మాయదారి రోగం. దానికి ముందు.. దాని తర్వాత అన్నట్లుగా చేసిన ఈ జీవితం గతంలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంతేనా.. లాక్ డౌన్ తర్వాత జీవితంలో గతంలో మనతో ఉండే ఎన్నో మిస్ కావటం పక్కా.