లాక్ డౌన్ టైం.. మలయాళమే ది బెస్ట్

లాక్ డౌన్ టైంలో ఇప్పుడు జనాలకు కాలక్షేపం అందిస్తున్నది సినిమాలే. టీవీల్లో వచ్చే సినిమాలు ఎక్కువగా పాతవే కావడంతో కొత్త చిత్రాల కోసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌నే ఆశ్రయిస్తున్నారు జనాలు. ఇక ఆ సముద్రంలోకి అడుగు పెట్టాక భాషా భేదం అంటూ ఏమీ ఉండదు. ఏ భాషా చిత్రానికైనా సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అన్నింటినీ ఓ రౌండ్ వేసేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులు మామూలుగా అయితే పరభాషా చిత్రాల్లో ఎక్కువగా చూసేది తమిళం, హిందీవే. ఐతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుణ్యమా అని మలయాళం చిత్రాల్ని కూడా ఇప్పుడు బాగా చూస్తున్నారు. ఐతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా మలయాళ సినిమాల గురించి చర్చ జరుగుతుండటంతో ఐఎండీబీ రేటింగ్స్, రివ్యూలు చూసుకుని కొన్ని సినిమాల్ని ఎంచుకుని వీక్షిస్తున్నారు జనాలు.

రీసెంట్ మలయాళ సినిమాల విషయానికి వస్తే ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ట్రాన్స్’ సౌత్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుండటంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. ఇది చూశాక ఫాహద్ సినిమాలన్నీ చూడాలన్న ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతోంది.

అతను గత ఏడాది నెగెటివ్ రోల్ చేసిన ‘కుంబలంగి నైట్స్’ సైతం వావ్ అనిపిస్తోంది. ఈ చిత్రానికి గాను దర్శకుడు మధు ప్రతిష్టాత్మక గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం కూడా అందుకోవడం విశేషం. ఇదొక అరుదైన చిత్రంగా చెప్పుకోవాలి. దీని గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

ఇక తెలుగులోకి రీమేక్ కాబోతున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ సినిమా కూడా మన ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తోంది. ఇంకా ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’, ‘జల్లికట్టు’, ‘అంగామలై డైరీస్’ లాంటి సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కొత్తగా మలయాళ సినిమాల రుచి చూస్తున్న మన ప్రేక్షకులు వాటి క్వాలిటీ ఏంటో తెలుసుకుంటున్నారు. ఇండియాలో ప్రస్తుతం కంటెంట్ పరంగా మలయాళ సినిమాలే ది బెస్ట్ అని కూడా అభిప్రాయపడుతున్నారు.