కరోనా పురుషుల్లోనే ఎక్కువ.. ఎందుకు?

కరోనా వైరస్ వ్యాప్తి మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పది మందిలో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు మగవాళ్లే. పురుషులు బయట ఎక్కువగా తిరగడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి వారిలో ఎక్కువగా ఉన్నట్లు భావించారు. ఐతే కరోనా పేషెంట్లయిన మగవాళ్లు ఉన్న ఇళ్లలోనూ మహిళలకు వైరస్ అంతగా సోకట్లేదని తెలుస్తుండటంతో దీని వెనుక మతలబు ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.

ఐతే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం దీని వెనుక కారణాలేంటో వెల్లడించింది. కోవిడ్-19 కారకమైన ‘సార్స్-కోవ్ 2’ వైరస్ యాంజియో టెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్-2 అనే ఎంజైమ్ ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్య సంస్థ కనుగొంది. ఇది కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్ లోనికి ప్రవేశించేందుకు తోడ్పడుతున్నట్లు తేల్చారు.

ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉంటుందని.. అందుకే వాళ్లు తేలిగ్గా వైరస్ బారిన పడుతున్నారని వెల్లడైంది. మహిళల్లో ఈ ఎంజైమ్ తక్కువగా ఉండటం వల్ల వారికి వైరస్ ముప్పు తక్కువగా ఉంటోందని తేలింది.

ఈ ఎంజైమ్ గురించి కరోనా వైరస్ రావడానికి ముందే తాము అధ్యయనం జరిపామని.. హృద్రోగ సమస్యల్ని అధ్యయనం చేస్తుండగా పురుషుల్లో ఈ ఎంజైమ్ అధికంగా ఉన్నట్లు గుర్తించామని.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దశలో ఈ ఎంజైమ్ గురించి మరింతగా పరిశోధిస్తే కరోనా వ్యాప్తికి అది దోహదపడుతున్నట్లు తేలిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి వాడే యాంజియో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్‌ను కరోనా వైరస్ రోగులకు ఇవ్వడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా ఈ అధ్యయనంలో తేలింది.