దిల్ రాజు ఓవర్ డోస్

హీరోల కుటుంబాల నుంచి కొత్త హీరోలు రావడం కామన్. అప్పుడప్పుడూ నిర్మాతల ఫ్యామిలీస్ నుంచి కూడా హీరోలొస్తుంటారు. విక్టరీ వెంకటేష్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు ఈ కోవలో చాలామందే హీరోలున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు కూడా తమ కుటుంబం నుంచి ఒక హీరోను పరిచయం చేస్తున్నాడు. అతనే.. ఆశిష్ రెడ్డి.

దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. ఆశిష్‌ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రణాళికలతోనే వచ్చాడు రాజు. ‘హుషారు’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన హర్షను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అనుపమ లాంటి పేరున్న కథానాయికను తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సహా టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.

ఐతే అంతా ఓకే కానీ.. ఆశిష్‌ను ప్రమోట్ చేసే విషయంలో రాజు ఓవర్ ద టాప్ వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. కొత్త హీరోను సాధ్యమైనంతగా దాచి పెట్టి ఉంచాలి కానీ.. అతడి కోసం ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసేస్తున్నాడు రాజు. సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేసినపుడల్లా ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ లాంటి వేడుక చేసి హంగామా చేయడం అతిగా అనిపిస్తోంది. ప్రమోషన్ అవసరమే కానీ.. మరీ ఇంతగానా అని జనాలు పెదవి విరుస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక్కో పాటను ఒక్కో సెలబ్రెటీతో రిలీజ్ చేయించి.. సోషల్ మీడియాలో ఫొటోలు పెడితే ఓకే కానీ.. ఇలా ప్రతిసారీ ఒక ఈవెంట్ చేయడం అనవసరమే.

దీని వల్ల జరిగే మేలు కంటే చేటే ఎక్కువ. ఇప్పటికైనా రాజు కొంచెం దూకుడు తగ్గించి.. ప్రమోషన్ ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్త పడితే… ప్రి రిలీజ్ ఈవెంట్ వరకు ఈ ఉత్సాహాన్ని కొంచెం దాచుకుంటే మంచిదేమో.