జనసేనలోకి చిరంజీవి.. నాగబాబు ఏమన్నాడంటే?

చాలా పెద్ద లక్ష్యాలతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు పొందాక రెండేళ్లు తిరక్కుండానే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన చిరు.. చివరికి ఆ రెండు బాధ్యతలూ ముగిశాక రాజకీయాలకే సెలవిచ్చేసిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల కిందట సినీ రంగంలోకి పున:ప్రవేశం చేసిన చిరు.. అప్పట్నుంచే సినిమాలే తన లోకం అన్నట్లుగా ఉంటున్నాడు. రాజకీయాల ఊసే ఎత్తట్లేదు. ఐతే గత ఏడాది ఎన్నికల సందర్భంగా తమ్ముడికి, జనసేన పార్టీకి మాట మాత్రమైనా మద్దతు పలకకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం జనసేనకే తన మద్దతు అని.. తమ కుటుంబంలో రెండు పార్టీలు ఉండబోవని చిరు స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో చిరు జనసేనలోకి వస్తారా అన్న ఒక ప్రశ్న అభిమానుల్లో ఉదయించింది. చిరు తమ్ముడు నాగబాబు నిర్వహించే యూట్యూబ్ ఛానెల్లో ఆయనకు ఓ అభిమాని నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.

దానికి ఆయన బదులిస్తూ.. ‘‘చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అనేక కారణాల వల్ల ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలందించారు. చివరికి ఈ రాజకీయాలు నాకొద్దు అని తిరిగి సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక తన అనుభవాన్నంతా సినీ రంగానికే ఉపయోగించాలనుకున్నారు. ఆయన పూర్తి సినిమాలకే అంకితం అయిపోయారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రాజకీయాల వైపు వెళ్లొద్దన్నది ఆయన ఉద్దేశం. దానికి కట్టుబడే ఉంటారని నా నమ్మకం. ఒకసారి రాజకీయాలు వద్దు అని బలంగా నిర్ణయించుకున్నాక జనసేనలోకి కూడా ఆయన రారు. ఆ పార్టీలో చేరినా రాజకీయాల్లోకి వచ్చినట్లే కదా. కాబట్టి రారని నా ఉద్దేశం. మరి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. కానీ నాకైతే ఆయన రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేయరనే అనిపిస్తోంది’’ అని స్పష్టం చేశాడు.