లాక్‌డౌన్‌తో ఇండియ‌న్స్‌కు 5 వేల కోట్లు మిగిలాయి

Lockdown

ఇండియాలో లాక్ డౌన్ పెట్ట‌డం వ‌ల్ల అన్ని వేల కోట్ల ఆదాయం పోయింది.. ఇన్ని ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది.. ఆ రంగం నాశ‌న‌మైంది. ఈ రంగం దెబ్బ తింది.. ఇలాంటి వార్త‌లే వింటున్నాం కొన్ని నెల‌లుగా. కానీ లాక్ డౌన్ వ‌ల్ల లాభం కూడా జ‌రిగింది.. దీని వ‌ల్ల‌ భార‌తీయులు 5 వేల కోట్ల‌కు పైగా ఆదాయం మిగుల్చుకున్నారు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కానీ ఇది నిజం. ఈ విష‌యం బ్రిటన్‌లోని సరెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల అధ్య‌య‌నంలో తేల‌డం విశేషం.

లాక్ డౌన్ ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు. లాక్ డౌన్ కారణంగా దేశ‌వ్యాప్తంగా కాలుష్యం ఎంత‌గానో త‌గ్గింద‌ని.. ఢిల్లీ, ముంబ‌యి, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై స‌హా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కాలుష్య శాతం త‌గ్గి ప్ర‌జారోగ్యం మెరుగుప‌డింద‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

గాల్లోని పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర అదుపులోకి వ‌చ్చింద‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. ఇతర నగరాల్లో 24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడింద‌ని కూడా ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితుల‌తో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.

వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి రూ.5 వేల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ర‌కంగా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు మిగ‌ల‌డంతో పాటు ఆరోగ్యాలు మెరుగుప‌డ్డాయ‌ని.. ఇది లాక్ డౌన్ వ‌ల్ల జ‌రిగిన మేల‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది.