శభాష్: టాయిలెట్లు కడిగిన ఏపీ ఐఏఎస్ లు

మీరు చదివింది నిజమే. చాలా మందికి ఏ పని చెప్పినా చేసేస్తామంటారు. అలాంటి వాళ్లు సైతం తమ ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేయమని చెబితే మాత్రం ముఖం మరోలా మారిపోతుంది. సొంతింట్లో వారు వాడే టాయిలెట్లను క్లీన్ చేసుకోవటానికి ఆసక్తి చూపని ఎంతోమందికి భిన్నంగా.. తమ ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ప్రజా శ్రేయస్సు కోసం.. పిల్లల్లో స్ఫూర్తిని నింపటంతో పాటు.. కొత్త అలవాటును నేర్పించేందుకు తామే స్వయంగా టాయిలెట్ బ్రష్ పట్టుకొని.. సర్కారు స్కూల్లో బాత్రూంను క్లీన్ చేయటం అంత సామాన్యమైన విషయం కాదు.

తాజాగాఅలాంటి పని చేసి మనసు దోచేశారు ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఐఏఎస్ లు చేసిన పని ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. విన్నోళ్లంతా అభినందించేస్తున్నారు. ఏపీకి ఒక కొసన ఉండే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఐఏఎస్.. మరో కొసన ఉండే నెల్లూరు జిల్లాలకు చెందిన ఐఏఎస్ అధికారి స్కూల్లో టాయిలెట్ ను కడిగి..బాత్రూంలను క్లీన్ గా ఉంచుకోవాల్సిన అవసరాన్ని పిల్లలకు తెలియజేసే పని చేశారు.

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ తాజాగా నెల్లిమర్ల లోని రెల్లీ వీధిలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ బాత్రూంకు వెళ్లిన ఆయన.. బ్రష్ పట్టుకొని.. బాత్రూం క్లీనర్ ను పోసి టాయిలెట్ ను క్లీన్ చేశారు. అనంతరం ఎవరి మరుగుదొడ్లను వారే శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లా కేంద్రంలోని పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న రాజశేఖర్ సైతం బాత్రూం క్లీన్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులు.. ఆయాలను చిన్నచూపు చూడకూడదన్న ఆయన.. స్కూల్ ఆవరణలో మొక్కలు సైతం నాటారు. ఏమైనా.. ఇద్దరు ఐఏఎస్ అధికారులు చేసిన పని ఫిదా అయ్యేలా చేయటమే కాదు.. సరికొత్త స్ఫూర్తిని నింపిందని చెప్పాలి. నయా గాంధీలుగా వీరి చర్యను పలువురు అభినందిస్తున్నారు.