ఈ డాక్టర్ త్యాగాన్ని చూస్తే.. దండం పెట్టాల్సిందే

కరోనా వేళ.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని దేశాన్ని రక్షించాలని కోరితే.. చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు.. తమకు ఏదో పని ఉన్నట్లుగా చెప్పి రోడ్ల మీదకు వచ్చే వారే తప్పించి.. మూడు వారాలు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవటానికి మించిన పెద్ద శిక్ష మరొకటి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నోళ్లు ఎంతోమంది. ఇలాంటివేళ.. ఇంటిని వదిలేసి.. ప్రమాదకర వైరస్ తో నిత్యం యుద్ధం చేసే వైద్యుల జీవితాల్ని గుర్తు తెచ్చుకుంటే భయంతో వణకాల్సిందే.

కరోనా వస్తుందన్న భయాందోళనలకు గురయ్యే ఎంతోమందికి భిన్నంగా కరోనా వైరస్ ఉన్న పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇవ్వటమంటే.. ల్యాండ్ మైన్ మీద కాలు వేసినట్లే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడక తప్పని పరిస్థితి. ఇలాంటివేళలోనూ ముప్పు గురించి ఆలోచించకుండా సేవ చేస్తున్న వైద్యులు ఎంతోమంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు వైద్యులు ఒక అడుగు ముందుకు వేసి.. తీసుకుంటున్న నిర్ణయాలుచూస్తే.. రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించకమానదు. భోఫాల్ కు చెందిన వైద్యుడు ఈ కోవలోకే వస్తారు.

జేపీ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ సచిన నాయక్ కరోనా పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ప్రమాదకరవైరస్ తో తానుచేస్తున్న పోరాటం కారణంగా ఇంట్లోని కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్న భావనతో ఆయన కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యుల్ని కలవటం లేదు. తనకు కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కారులోనే ఉంచుకొని అందులోనే ఉంటున్నారు.

కరోనా వైరస్ చాలా సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని.. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెబుతున్నారు. తన కారణంగా తన కుటుంబ సభ్యులు కష్టాల్లో పడకూడదన్న ఉద్దేశంతో కారునే ఇల్లుగా మార్చేసుకున్నారు. కారులో ఉండి.. పుస్తకం చదువుతున్న ఆయన ఫోటో ఇప్పడు వైరల్ గా మారింది. ఆయన త్యాగం గురించి తెలిసిన వారంతా ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.