మీ వల్ల కరోనా వచ్చి పోతే మర్డర్ కేసే..

గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలు నిర్వహించకుంటే  ఈపాటికి మన దేశంలో కరోనా వైరస్ చాలా వరకు కట్టడి అయ్యేదేమో. లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా కూడా అడుగులు పడేవేమో. కానీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందల మంది కరోనా బారిన పడటం.. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు తమతో సన్నిహితంగా ఉన్న వందల మందికి వైరస్ వ్యాప్తి చేయడంతో గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

అంతకుముందు ఏపీ తెలంగాణల్లో రోజూ సింగిల్ డిజిట్లో కరోనా కేసులు బయటపడేవి. కానీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వాళ్లు కరోనా బారిన పడ్డాక పదుల సంఖ్యలో రోజూ కేసులు బయటికి వస్తున్నాయి. ఐతే కరోనా మీద పెద్దగా అవగాహన లేక, ప్రార్థనలు జరిగిన సమయానికి భయం కొరవడి వీళ్లందరూ వైరస్ బారిన పడ్డారనుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో తెలిశాక అయినా అప్రమత్తం కావాలి.

కానీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన చాలామంది ఇంటిపట్టునే ఉండిపోతుండటం.. పరీక్షలకు ముందుకు రాకపోవడం.. వైద్య సిబ్బంది వారి కోసం వస్తే దాడులు చేయడం లాంటి పరిణామాలే ఆందోళన కలిగి్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లో వీరి కోసం వెళ్లిన వైద్య సిబ్బందిని ఎలా తరిమికొట్టారో.. ఎలా దాడులు చేశారో చూశాం. ఇలాంటి ఉదంతాలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ డీజీపీ సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించి స్వచ్ఛందంగా పరీక్షల కోసం ఆసుపత్రులకు రాకపోతే వారిపై హత్యాయత్నం కేసు పెడతామన్నారు. అలాగే వీరి కారణంగా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కరోనా సోకి చనిపోతే మర్డర్ కేసు పెడతామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. తక్షణం పరీక్షల కోసం రావాలని.. లేని పక్షంలో తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే తప్ప మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన అందరిలో కదలిక రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.