జై శ్రీరామ్…నా నిబద్ధతకు ప్రతిబింబం ఈ తీర్పు:అద్వానీ

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో ప్రత్యేక సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతీ, బీజేపీ నేత కల్యాణ్ సింగ్ సహా ఈ కేసులో నిందితులంతా నిర్దోషులను తీర్పునిచ్చారు.

వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసులో సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై ఎల్ కే అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత నిబద్ధతకు ఈ తీర్పు ప్రతిబింబమని అద్వానీ అన్నారు.

`‘జైశ్రీరాం…చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందింది…ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా“అని అద్వానీ అన్నారు. ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైందని, తీర్పు వెలువడిన సమయం తమకు సంతోషకరమైన క్షణం అని హర్షం వ్యక్తం చేశారు. రామ జన్మభూమి ఉద్యమం పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతకు ఈ తీర్పు ప్రతిబింబం అని అద్వానీ అన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు.
డిసెంబర్ 6 న అయోధ్యలో జరిగిన ఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని ఈ తీర్పు రుజువు చేస్తోందని, తాము చేపట్టిన ర్యాలీల్లో, కార్యక్రమాల్లో కుట్ర లేదని తెలిపారు. ఈ తీర్పుతో తాము చాలా సంతోషంగా ఉన్నామని, అందరూ రామ మందిర నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నామని మనోషర్ జోషి సంతోషం వ్యక్తం చేశారు. వయసు రీత్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు కోర్టుకు రావాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి చెప్పడంతో వీరిద్దరూ హాజరుకాని సంగత తెలిసిందే.