ఇన్ని వ్య‌తిరేక‌త‌ల్లోనూ.. మోడీ గ్రాఫ్ దూకుడు.. రీజ‌నేంటి?

దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్త్యంగా కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇటీవ‌ల టైమ్ మేగ‌జీన్ నిర్వ‌హించిన అత్యంత ప్ర‌తిభావంతులైన నాయ‌కుల్లో మోడీ చోటు సంపాయించుకున్నారు. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ఆయ‌న నాయ‌క‌త్వానికి జోహార్లు.. అంటూ.. కొనియాడింది. ఇక‌, దేశంలో చూసుకుంటే.. ఆయ‌న‌ను నేరుగా ఎదిరించే.. ఎద‌ర్కొనే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? నిజంగానే ఆయ‌న నాయ‌క‌త్వ ప‌టిమ అలాంటిదా? లేక ఎలాంటి లోపాలు లేకుండా దేశాన్ని పాలిస్తున్నారా? ఇవ‌న్నీ.. కాకుండా.. ఎన్ని వ్య‌తిరేక‌త‌లున్నా.. ఆల్ట‌ర్‌నేట్ నాయ‌కుడు లేక‌పోవ‌డ‌మా?

రాజ‌కీయకీయ వేదిక‌ల‌పై ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క విష‌యం ఇదే. న‌రేంద్ర మోడీ వ‌రుస విజ‌యాలు సాధించి.. కేంద్రంలో గాంధీల కుటుంబానికి చుక్క‌లు చూపిస్తున్నారు. అంతేకాదు, స‌మీప భ‌విష్య‌త్తులో ఎవ‌రూ ప్ర‌ధాని పీఠానికి త‌గిన వారు లేర‌నేలా ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారనేది వాస్త‌వం.

అయితే, ఇవ‌న్నీ కేవ‌లం పాల‌న‌తో వ‌చ్చిన మెరుపులు కావు. ఆయ‌న పాల‌న‌లో దేశం అనేక సంక‌ట స్థితుల‌ను ఎదుర్కొంటోంద‌న్న‌ది వాస్త‌వం. పెద్ద నోట్ల ర‌ద్దుతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన‌గా.. ఇప్పుడు క‌రోనాను దీటుగా ఎదుర్కొనే విష‌యంలోనూ ఆయ‌న చేతులు ఎత్తేశార‌నేది నిష్టుర స‌త్యం. ఇక‌, రాష్ట్రాల అధికారాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అంట‌క‌త్తెర వేస్తున్నారు.

ఆర్థిక‌, విద్య‌, పాల‌న వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చాలా వ‌ర‌కు హ‌క్కులు కేంద్రానికి ద‌ఖ‌లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో జీఎస్టీ, నీట్‌, వివిధ కేంద్ర ప్రాయోజిత‌ ప‌థ‌కాలు.. వంటివి కేంద్రం గుప్పిట‌లోనే ఉన్నాయి. అంటే ఒక‌ర‌కంగా.. రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకొంటున్నా.. కేంద్రం గుప్పిట్లోనే పాల‌న సాగించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, క‌రోనా విష‌యంలోనూ మోడీ చేతులు ఎత్తేసిన మాట వాస్త‌వం. ఏమీ లేనప్పుడు లాక్‌డౌన్ ప్ర‌క‌టించి.. వైర‌స్ విజృంభించిన స‌మ‌యంలో లాక్‌డౌన్ ఎత్తేశారు. ఇక‌, చైనాతో భార‌త్‌కు ఏం జ‌రుగుతోందో మూడో కంటికి తెలియ‌దు. పైకి మాత్రం చైనా రెచ్చ‌గొడుతోంద‌ని అంటున్నా.. అస‌లు ఇప్ప‌టికే భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించింద‌ని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇలా.. ఒక‌టి కాదు.. అనేక రూపాల్లో న‌రేంద్ర మోడీ విఫ‌ల‌మ‌య్యారు. పైగా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌ను కాల‌రాసి.. బీజేపీ ప‌గ్గాలు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ తూట్లు పొడుస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది.

ఇలా అనేక రూపాల్లో వ్య‌తిరేకత ఉన్న‌ప్ప‌టికీ.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆయ‌న త‌ప్ప ఈ దేశానికి మ‌రో నాయ‌కుడు, న‌డిపించేవాడు లేడ‌నేలా వ్య‌వ‌హ‌రించ‌డం మోడీకే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది కూడా నిజ‌మే. కాంగ్రెస్ పుంజుకోవ‌డం మాట అటుంచితే.. అస‌లు ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో మోడీ చుట్టూ వ్య‌తిరేక‌త‌ల గూడు అల్లుకున్నా.. ఆయ‌న‌దే పైచేయిగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి మారుతుందో చూడాలి.