బోర్లు వేస్తున్నారు సరే…మరి వీటిని మరచిపోతే ఎలాగ ?

రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ‘వైఎస్సార్ జలకళ’ అనే పథకాన్ని ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చుచేసినా తక్కువనే చెప్పాలి. తాజాగా మొదలైన పథకంలో భాగంగానే నాలుగు సంవత్సరాల్లో 2 లక్షల బోర్లు వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

బోరు వేసిన చోట నీళ్ళు పడకపోతే ప్రభుత్వమే మరో చోట బోరు వేయిస్తుందని హామీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3 లక్షల మంది రైతులకు, 5 లక్షల ఎకరాలకు లబ్ది జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం నాలుగేళ్ళకు రూ. 2340 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించింది. ప్రభుత్వం మొదలుపెట్టిన పథకం మంచిదనే చెప్పాలి.

ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు, హామీలు అంతా బాగానే ఉన్నాయి. బోర్లు వేస్తారు సరే మరి వాటికి మోటార్లు ఎవరు బిగిస్తారు ? పొలాల్లో బోర్లు వేయించుకోవాలంటే సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుందన్నది ఓ అంచనా. బోర్లు వేయించుకోలేక, బావులు ఎండిపోయి, ఇతరత్రా మరే నీటి ఆధారం లేకనే మెజారిటి రైతులు నానా ఇబ్బందులు పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాధారంతోనే వ్యవసాయం చేస్తున్న రైతులు కొన్ని లక్షలమంది ఉంటారనటంలో సందేహం లేదు.

ఇటువంటి వాళ్ళకు ప్రభుత్వం వేయించే బోర్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. కానీ వాటికి మోటార్లు బిగించే విషయంలోనే ఇబ్బందులు మొదలవుతాయి. వ్యవసాయ మోటార్లంటే తక్కువలో తక్కువ ఓ రూ. 5 వేలుటుంది. మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎందుకంటే లక్షలాది మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. ఇటువంటి వాళ్ళంతా ఒక ఎకరా, అర్ధ ఎకరాలో వ్యవసాయం చేసుకుంటుంటారు. ఇటువంటి వాళ్ళకు వేల రూపాయలు పెట్టి మోటారు కొనేంత స్తోమత ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.

కాబట్టి ఇటువంటి సన్న, బక్క రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బోర్లతో పాటు మోటార్లను కూడా అందిచగలిగితే రైతాంగానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. బోర్ల కోసం నాలుగేళ్ళల్లో రూ. 2340 కోట్లు ఖర్చు చేయగలిగిన ప్రభుత్వం మోటార్ల కోసం మహా అయితే మరికొన్ని వందల కోట్ల రూపాయల భారాన్ని మోయలేందా ? ప్రభుత్వం చేసే సాయం వల్ల రైతాంగం లాభపడితే అంతకన్నా కావాల్సిందేముంది. అన్నదాతలపై పెడుతున్న ఖర్చును ప్రభుత్వం ఖర్చని అనుకునేందుకు లేదు. కాబట్టి బోర్లతో పాటు మోటార్లను అందించే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది.

వాస్తవానికి ఈ పథకాన్ని టీడీపీ హయాంలో ఎన్టీఆర్ జలసిరి పేరుతో మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేశారు. అప్పట్లో మోటార్లు కూడా ఆ పథకం కింద ఇచ్చేవారు. జగన్ ఇపుడు కేవలం బోర్లు మాత్రమే వేయిస్తాను అంటున్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకంలో ఉన్న మోటారు ఏర్పాటుకు కోత పెట్టారు. సాధారణంగా వేరే ప్రభుత్వం వస్తే పథకంలో మరిన్ని ప్రయోజనాలు దక్కుతుంటాయి. కానీ పథకంలో కోతలు పెట్టడమే జగన్ సర్కారు ధైర్యమనే చెప్పాలి.