ఆ డైరెక్టర్ పెద్ద షాకే ఇచ్చాడే..

మూడేళ్లకు పైగా వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించి తనకు లైఫ్ ఇస్తుందని అనుకున్నాడు. కానీ అతడి ప్రణాళికలు ఫలించలేదు. అనివార్య పరిస్థితుల్లో ఈ సినిమాను ‘ఆహా’లో రిలీజ్ చేసేస్తున్నారు.

కాస్టింగ్ వల్ల కావచ్చు, సరైన ప్రోమోలు రిలీజ్ చేయకపోవడం వల్ల కావచ్చు.. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. పైగా ఈ సినిమా రిలీజవుతున్న అక్టోబరు 2నే అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ను విడుదల చేస్తుండటంతో జనాల ఫోకస్ మొత్తం దాని మీదే ఉంది. ‘ఒరేయ్ బుజ్జిగా’ గురించి డిస్కషనే లేదు. ఐతే కంటెంట్ బాగుంటే నెమ్మదిగా అయినా సినిమా చర్చల్లోకి వస్తుందని.. జనాల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను రూపొందించిన విజయ్ కుమార్ కొండా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నాగచైతన్య, పూజా హెగ్డేలతో అన్నపూర్ణ స్టూడియో బేనర్లో ‘ఒక లైలా కోసం’ లాంటి కొంచెం పెద్ద ప్రాజెక్టునే డీల్ చేశాడు. ఆ సినిమా నిరాశ పరచడంతో కొంత కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తర్వాత రేంజ్ తగ్గించుకుని రాజ్‌తో సినిమా చేయాల్సి వచ్చింది. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి అతడికి కన్నడలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ హీరోగా ‘రైడర్’ మూవీ చేసే అవకాశం వచ్చింది.

అది కొంచెం పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. ‘రైడర్’తో హిట్టు కొట్టి అక్కడే సెటిలైపోతాడేమో అనుకుంటే.. ఆ సినిమా ఆరంభ దశలో ఉండగానే.. మళ్లీ రాజ్‌ తరుణ్‌తో ఓ సినిమా ఆరంభించి షాకిచ్చాడు. వనమాలి క్రియేషన్స్ అనే కొత్త సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఓవైపు ‘రైడర్’ చేస్తూ.. ఇక్కడ రాజ్‌తో సినిమా మొదలుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులనూ ఒకేసారి ఎలా డీల్ చేస్తాడో.. రాజ్‌తో సినిమాను ఎలా వర్కవుట్ చేస్తాడో చూడాలి.