మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేశారు

సెలవు రోజుల్లోనూ పని చేయటం.. విదేశీ ప్రయాణాలు చేసే వేళలో.. ఉదయం సమావేశాల్లోనూ.. రాత్రిళ్లు విమానాల్లోనూ నిద్రపోయే అలవాటున్న మోడీకి అంతటి శక్తి ఎలా వస్తుంది? ఆయన ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లుగా కనిపించరు. అంత ఫిట్ గా ఎలా ఉంటారు? అన్న ప్రశ్న చాలామందిలో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను చెప్పేశారు ప్రధాని మోడీ.

తాజాగా పలువురు ఫిట్ నెస్ నిపుణులు..క్రీడాకారులతో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కొత్త నినాదం బయటకు వచ్చింది. ఫిట్ నెస్ కి డోస్.. ఆధా గంటా రోజ్ అంటూ చెప్పిన ఆయనతో మాట్లాడిన వారిలో క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జమ్ముకశ్మీర్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆఫ్ షాన్ ఆషిక్.. పారా ఒలింపిక్స్ లో స్వర్ణ విజేత దేవేంద్ర ఝుజారియా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ అడగ్గా.. ఆయన స్పందించారు. ఆయన్ను ప్రశ్నించింది మరెవరో కాదు 55 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉండే ఒకప్పటి సూపర్ మోడల్ మిలింద్ సోమన్. తన తల్లి తనకు వారానికి రెండుసార్లు ఫోన్ చేస్తుందని చెప్పారు. ‘‘యోగ క్షేమాలు అడుగుతుంది. ప్రతిసారీ ఆమె తప్పనిసరిగా అడిగేది ఒక్కటే. ఆహారంలో పసుపు ఉండేట్లు చూసుకుంటున్నావా? అని. తగు మోతాదులో పసుపు తీసుకుంటున్నావా? అని ఆమె అడిగితే.. నేను అవునని చెబుతారు. పసుపు యాంటీ బయాటిక్. ఎంతో మంచిది. ఈ విషయాన్ని నేనుచాలా సందర్భాల్లో చెప్పాను’’ అని పేర్కొన్నారు.

ఇక.. ఈ సమావేశంలో పాల్గొన్న సూపర్ మోడల్ మిలింద్ తన ఫిట్ నెస్ గురించి చెబుతూ.. తనకు తన తల్లే స్ఫూర్తిగా చెబుతారు. 81 ఏళ్ల వయసులోనూ ఆమె ఎలా బస్కీలు తీస్తుందో అందరూ వీడియోల్లో చూస్తుంటారని.. ఆమె వయసుకు వచ్చేసరికి ఆమెలానే ఫిట్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఒకప్పుడు రోజుకు 50కిలోమీటర్లు నడిచేవారని.. తన దృష్టిలో రోజుకు 100కి.మీ. దూరం నడవటం కూడా పెద్ద కష్టం కాదన్నారు. పట్టణాలతో పోలిస్తే.. పల్లెల్లో ప్రజలు చాలా ఫిట్ గా ఉంటారన్నారు. అదే పనిగా కూర్చొని చలనం లేకుండా ఉండటమే నగరవాసుల్లో కనిపిస్తుందన్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అది ఇదీ తాగాల్సిన అవసరం లేదని చెప్పటం గమనార్హం.