సాయిరెడ్డికే జ‌గ‌న్ జై.. రీజ‌నేంటంటే!

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎవ‌రిని ఎక్కువ‌గా న‌మ్ముతారు? ఎవ‌రితో ఆయ‌న‌కు అనుబంధం ఎక్కువ‌? రాజ‌కీయంగాను, వ్య‌క్తిగ‌తంగాను జ‌గ‌న్‌.. ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఒక్క‌రే క‌నిపిస్తారు. నిజానికి జ‌గ‌న్ చుట్టూ చాలా మంది నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌తంగా లేదా.. ఆంత‌రంగికంగా చ‌ర్య‌లు జ‌ర‌పాల్సి వ‌చ్చినా.. పార్టీలో కీల‌క విష‌యాలపై నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చినా.. కేంద్రంలో వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పాల్సి వ‌చ్చినా.. జ‌గ‌న్ సంప్ర‌దించే అతి కొద్ది మంది వ్య‌క్తుల్లో.. సాయిరెడ్డి ఒక‌రు.

వాస్త‌వానికి జ‌గ‌న్‌తో అనేక మంది స్నేహం చేశారు. క‌లిసి తిరిగారు. కానీ, అతి కొద్ది మంది మాత్ర‌మే ఆయ‌నతో ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌లిసి తిరుగుతున్నారు. ఇలాంటి వారిలోనూ సాయిరెడ్డి కీల‌కంగా ఉన్నారు. మ‌రి వీరి మ‌ధ్య బంధం ఎప్ప‌టిది? జ‌గ‌న్ ఎందుకు అంత‌గా ప్రాధాన్యం ఇస్తారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తాయి. సాక్షి ప‌త్రిక పెట్ట‌డానికి ముందు.. జ‌గ‌న్ స్థాపించి వ్యాపార లావాదేవీల‌ను ప‌ర్య‌వేక్షించే ఆడిట‌ర్‌..గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సాయిరెడ్డి అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 20 ఏళ్లుగా జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అటు వ్యాపారంలోనే కాదు.. రాజ‌కీయంగా కూడా సాయిరెడ్డి వ్యూహాలు.. జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకురావ‌డంతో కీల‌కంగా మారాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇక‌, జ‌గ‌న్‌లో సాయిరెడ్డికి న‌చ్చిన విష‌యం మాట ప‌క్క‌న పెడితే.. సాయిరెడ్డిలో ఉన్న గ‌ట్స్‌, ఎక్క‌డైనా నిర్మొహ‌మాటంగా మాట్లాడే వ్య‌క్తిత్వం జ‌గ‌న్‌కు బాగా న‌చ్చింద‌ని చెబుతారు. నిజానికి ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యం ఇంకా కొలిక్కిరాలేదు. కానీ, తాజాగా పార్ల‌మెంటులో మాట్లాడిన సాయిరెడ్డి.. పాల‌నా రాజ‌ధానిగా ఏర్ప‌డుతున్న విశాఖ‌లో ట్రిపుల్ ఐటీ, క్యాట్ వంటి వి కావాల‌ని కోర‌డం సంచ‌ల‌నంగా మారింది.

నిజానికి మిగ‌తా ఎంపీలు ఎవ‌రూ కూడా మూడు రాజ‌ధానుల‌పై పార్ల‌మెంటులో ఎక్క‌డా గ‌ళం వినిపించ‌డం లేదు. కానీ, సాయిరెడ్డి మాత్రం రాజ్య‌స‌భ‌లో దీని ప్ర‌స్తావిస్తూ.. మాట్లాడారు. అదేవిధంగా ఎన్నిక‌ల‌కు ముందు కూడా .. చంద్ర‌బాబును న‌మ్మ‌డానికి వీల్లేద‌ని, ఆయ‌న వ్యూహానికి పై వ్యూహం వేయాల్సిందేనంటూ.. మాట్లాడిన ఆడియో ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఇలా.. పార్టీలో ఏ విష‌యాన్ని ఎక్క‌డ ప్ర‌స్తావించి.. పార్టీ రేంజ్‌ను పెంచాలో తెలిసిన నాయ‌కుడిగా సాయిరెడ్డి గుర్తింపు పొందారు. ఇదే జ‌గ‌న్‌కు న‌చ్చిన ప‌రిణామం. వీరి మ‌ధ్య బంధానికి కూడా ఇరువురిలోనూ ఉన్న గ‌ట్సే కార‌ణం అంటారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం..ఉండ‌డ‌మే వీరిమ‌ధ్య కీల‌క‌మైన బ‌లం!