టాలీవుడ్లో ఓటీటీ వేడి

మిగతా ఇండస్ట్రీలు ఓటీటీ రిలీజ్‌ విషయంలో చాలా ముందంజలో ఉంటే.. టాలీవుడ్ మాత్రం అంతగా ఆసక్తి లేనట్లు కనిపించింది. హిందీలో పేరున్న సినిమాలు జూన్ నెల నుంచే ఓటీటీల్లో విడుదలవుతూ వచ్చాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా కాస్త పేరున్న సినిమాలు ఇలా రిలీజయ్యాయి. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ధైర్యం చేయలేదు.

రెండు మూడు నెలలు ఆగితే థియేటర్లు తెరుచుకుంటాయన్న ఆశాభావంతో ఎదురు చూశారు. మధ్యలో కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి కానీ.. కొంచెం రేంజ్ ఉన్న సినిమాలేవీ ఇటువైపు చూడలేదు. కానీ ఆరు నెలలైనా థియేటర్లు తెరుచుకోకపోవడంతో మన నిర్మాతల ఆలోచనలు మారిపోయాయి.

ఈ మధ్యే ‘వి’ లాంటి పెద్ద సినిమాను నేరుగా అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా ఆశించిన స్పందన రాబట్టుకోవడంతో కొన్ని రోజుల పాటు స్తబ్దత నెలకొంది. కొత్త ఓటీటీ రిలీజ్‌ల విషయంలో ఎలాంటి అప్ డేట్లు లేకపోయాయి.

దీంతో ప్రేక్షకుల్లో నిరాశ కనిపించింది. కానీ ఉన్నట్లుండి టాలీవుడ్లో మళ్లీ కదలిక వచ్చింది. వరుసబెట్టి కొత్త సినిమాల్ని ఓటీటీల్లోకి వదిలేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే అక్టోబరు 2న ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆహాలో విడుదల కాబోతున్నట్లు ప్రకటన రాగా.. అదే ఓటీటీలో ‘కలర్ ఫొటో’ రిలీజ్ కూడా కన్ఫమ్ అయింది. ఆ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 23న రాబోతోంది.

మరోవైపు అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ను కూడా అక్టోబరు 2నే రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు చిత్ర బృందం మీడియాకు లీకులు కూడా ఇచ్చేసింది. నెల రోజుల్లో మూడు తెలుగులో సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కావడం, అందవులో రెండు ఒకే రోజు రాబోతుండటం విశేషమే.

మరోవైపు సోలో బ్రతుకే సో బెటర్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, దటీజ్ మహాలక్ష్మి లాంటి సినిమాల్ని కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ మూడు కూడా అక్టోబరు, నవంబరు నెలల్లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి థియేటర్లలో కొత్త సినిమాలను మిస్ అవుతున్న తెలుగు ప్రేక్షకులకు వచ్చే రెండు నెలల్లో ఓటీటీ విందు ఘనంగానే ఉండేలా ఉంది.