రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే విపక్షంలా మారిన ఆర్ఆర్ఆర్…తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కేంద్ర బలగాల భద్రత కోరి సంచలనం రేపారు. ఓ వైపు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ…మరో వైపు సీఎం జగన్ మరో 30 ఏళ్లు సీఎం అంటూ పొగుడుతున్నారు.

తాను రాజీనామా చేయబోనని, తాను సీఎం జగన్ బొమ్మతోపాటు తన ఇమేజ్ తోనే గెలిచానని గతంలోనే పలు మార్లు చెప్పారు రఘురామకృష్ణరాజు. ఈ నేపథ్యంలో సొంతపార్టీపై ప్రత్యక్షంగా జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న రఘురామకు వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. తాజాగా వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు రఘురామకు ఆహ్వానం ఇవ్వలేదు వైసీపీ సర్కార్. దీంతో, తనను బహిష్కరించినట్లే భావిస్తానని రఘురామ వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ సమావేశానికి అందరు ఎంపీలతోపాటు రఘురామకు కూడా మెసేజ్ ద్వారా ఆహ్వానం అందింది. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే సమావేశానికి రావద్దంటూ ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు ఫోన్ చేసి చెప్పారు. దీంతో, రెబల్ ఎంపీ రఘురామకు వైసీపీ అధిష్టానం షాకిచ్చినట్లయింది. దీనిపై తనకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరిన రఘురామ….పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు భావిస్తున్నానని అన్నారు.

విప్ ఇస్తే పాటించాల్సిన బాధ్యత తనపై ఉందని, పార్టీకి తనకు సంబంధం లేదని చెప్పినట్లే భావిస్తానని చెప్పారు. న్యాయనిపుణులతో మాట్లాడి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటానని, దీనిని ఏవిధంగా భావించాలో ఆ విధంగానే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇకపై, తన విమర్శలు విషయంలో రఘురామ …రఘురామ విషయంలో వైసీపీ అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళతాయన్నది ఆసక్తికరంగా మారింది.