సమంత ఇంకా డాబా దిగలేదు

లాక్‍ డౌన్‍ పేరుతో ఆరునెలల పాటు ఇంట్లోనే వుండిపోయిన తెలుగు సినిమా తారలు ఒక్కొక్కరూ బిక్కు బిక్కుమంటూ బయటకు వస్తున్నారు. కరోనా సోకుతుందనే భయం ఏ మూలనో వున్నా కానీ ఇక పనులు మొదలు పెట్టక తప్పదని డిసైడయ్యారు. అక్కినేని కాంపౌండ్‍ నుంచి ముందుగా నాగార్జున బయటకు వచ్చి ‘వైల్డ్ డాగ్‍’ షూట్‍ చేస్తోంటే, నాగ చైతన్య కూడా ‘లవ్‍స్టోరీ’ షూటింగ్‍కి వెళ్లి వస్తున్నాడు. మామ, భర్త ఇద్దరూ పనిలో పడినా కానీ సమంత మాత్రం ఇంకా షూటింగ్‍కి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

ఈ లాక్‍ డౌన్‍ టైమ్‍లో డాబా మీదే కూరగాయలు పండించుకుని వండుకు తిన్న సమంత యోగా, మెడిటేషన్‍ లాంటివాటితో కాలక్షేపం చేసింది. ఈ లాక్‍ డౌన్‍ సమయంలో సగటు గృహిణి బాధ్యతలతో బిజీ అయిన సమంత మధ్యలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‍’ వెబ్‍ సిరీస్‍ కోసం డబ్బింగ్‍ పూర్తి చేసేసింది. అయితే షూటింగ్‍కి వెళ్లడానికి మాత్రం ఆమె ఇంకా తటపటాయిస్తోంది.

ఇదిలావుంటే హీరోయిన్లు ఒక్కొక్కరుగా మళ్లీ షూటింగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. పూజా హెగ్డే హైదరాబాద్‍ చేరిపోయి ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ పని పూర్తి చేయాలని చూస్తోందట. అదయ్యాక ప్రభాస్‍తో కలిసి ‘రాధేశ్యామ్‍’ షూటింగ్‍లో పాల్గొంటుందట. మరి సమంత ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు సెట్టెక్కిస్తుందో చూడాలిక.