సోనూ కంటే ముందు మోడీ స్పందించాడు

సోనూ సూద్.. లాక్ డౌన్ టైంలో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు. కరోనా ధాటికి అల్లాడుతూ, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న జనాలకు అతను చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే అక్కడితో ఆగిపోకుండా పరిస్థితులు చక్కబడ్డాక కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా స్పందిస్తున్నాడు. వాళ్లకు అత్యవసరంగా సాయం అందిస్తున్నాడు.

ఇలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఒక్క రోజు వ్యవధిలో ట్రాక్టర్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఇంకా దేశవ్యాప్తంగా ఇలా అనేక రకాలుగా, అనేక మందికి సాయపడుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన చాలా సమస్యల్ని అతను పరిష్కరించాడు.

ఐతే ఇటీవలే మహారాష్ట్రకు చెందిన స్వప్నాలి అనే అమ్మాయి.. వెటర్నరీ సైన్స్ చదువుతూ.. ఆన్ లైన్ క్లాసులు అటెండ్ కావడం కోసం తన ఊరిలో కొండపైకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం గురించి మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి తెలిసి ఆ అమ్మాయి ఇంటికి అతి త్వరలో వైఫై వస్తుందని సోనూ హామీ ఇచ్చాడు.

ఐతే అతడి బృందం ఆ ప్రయత్నాల్లో ఉండగానే కేంద్రంలోని మోడీ సర్కారు అప్రమత్తం అయింది. ఇలా అన్ని సమస్యలూ సోనూ తీర్చేసి క్రెడిట్ తీసుకుంటే తమ సంగతేంటి అనుకున్నారో ఏమో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ అమ్మాయి ఉన్న గ్రామానికి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటర్నెట్ వచ్చేలా చేశారు. దీంతో స్వప్నాలి ఇంట్లో కూర్చుని బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ద్వారా ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతోంది.

నిన్న-నేడు అంటూ ఒకప్పుడు వర్షం పడుతుండగా కొండ మీద గుడిసెలో చదువుకుంటున్న ఫొటో.. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బంది లేకుండా పాఠాలు నేర్చుకుంటున్న ఫొటో పెట్టి మోడీని కీర్తిస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే స్థానిక నాయకులు సైతం ఈ అమ్మాయికి సాయం చేసేందుకు పోటీ పడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికే రూ.50 వేల సాయం అందించాడు.