అఖిల్‌ను ఆదుకోవ‌డానికి వాళ్లు రెడీ

అక్కినేని యువ క‌థానాయ‌కుడు అఖిల్‌కు అరంగేట్రానికి ముందు ఉన్న క్రేజ్.. ఆ త‌ర్వాత లేక‌పోయింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య హీరోగా అరంగేట్రం చేసిన అత‌ను.. తొలి సినిమా అఖిల్, ఆ త‌ర్వాత చేసిన రెండు సినిమాలతో డిజాస్ట‌ర్లు ఎదుర్కోవ‌డంతో ముందున్న క్రేజ్ మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు స్టార్‌గా ఎద‌గ‌డం కంటే హిట్టు కొట్టి హీరోగా నిల‌బ‌డితే చాలు అనే స్థితిలో ఉన్నాడ‌త‌ను.

ప్ర‌స్తుతం అతను గీతా ఆర్ట్స్ బేన‌ర్లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా లేకుంటే ఈ సినిమా విడుద‌ల‌య్యేది, దాని ఫ‌లిత‌మేంటో తేలిపోయేది. ఆ త‌ర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచించేవాడేమో అఖిల్. కానీ ఆ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.

లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న నాగార్జున‌.. చిన్న కొడుకు కోసం కొత్త సినిమా సెట్ చేశాడు. సైరా లాంటి భారీ చిత్రం తీసిన సురేంద‌ర్ రెడ్డి అఖిల్‌తో త‌ర్వాతి సినిమా చేయ‌డానికి రెడీ అవ‌డం విశేషం. ఈ చిత్రాన్ని క్రిష్ స‌న్నిహితుల ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్ ప్రొడ్యూస్ చేస్తుంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ సురేంద‌ర్ దాదాపు రూ.40 కోట్ల బ‌డ్జెట్ చెప్ప‌డంతో వాళ్లు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి.

ఐతే ఇప్పుడు వారి స్థానంలోకి 14 రీల్స్ ప్ల‌స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపీనాథ్ ఆచంట వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్న వీళ్లు.. ఆ చిత్రం వాయిదా ప‌డ‌టంతో దాని స్థానంలో అఖిల్ సినిమాను టేక‌ప్ చేయ‌డానికి రెడీ అయ్యార‌ట‌. నాగ్ ప్ర‌మేయంతోనే వాళ్లు ఈ సినిమాకు ఓకే చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంటున్నారు.