స్కూళ్ల మీద క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్

కరోనా వేళ.. ఎవరింట్లో వారు ఉండటం.. అవసరమైతే తప్పించి బయటకు రాకుడదన్న ప్రాథమిక సూత్రాన్నిపక్కన పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ ఏడాదికి సర్కారీ స్కూళ్ల పరిస్థితి ఏమిటన్న అంశంపై గందరగోళం నెలకొన్న వేళ.. పుల్ క్లారిటీ ఇచ్చేస్తూ.. తాజాగా ఆదేశాల్ని జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్ని ఓపెన్ చేసి.. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పేలా నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఈ నెల 27 (ఎల్లుండి) నుంచి టీచర్లంతా స్కూళ్లకు హాజరు కావాలని.. సెప్టెంబరు 1 నుంచి దూరదర్శన్.. టీసాట్ ఛానల్ ద్వారా పాఠాలు చెప్పాలని డిసైడ్ చేశారు. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి కంటెంట్ ను టీచర్లు సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆన్ లైన్ లో క్లాసులే తప్పించి.. స్కూళ్లను తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని చెప్పేసింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యార్థులకు స్కూళ్లలో అనుమతి లేదని పేర్కొంది. వాస్తవానికి తొలుత తీసుకున్న నిర్ణయానికి.. తాజాగా జారీ అయిన ఆదేశాలకు సంబంధం లేకపోవటం గమనార్హం. తొలుత.. టీచర్లంతా స్కూళ్లకు వెళ్లాలని పేర్కొంటూనే.. కనీసం యాభై శాతం మంది బడుల్లో ఉండాలన్నారు. తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో మాత్రం.. ప్రతి ఒక్క టీచర్ స్కూళ్లకు వెళ్లాల్సిందేనని తేల్చేశారు.

సర్కారీ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. టీవీలు కూడా లేవని తేలింది. ఇలాంటివేళలో.. ఆన్ లైన్ క్లాసులకు వారిని ఎలా అటెండ్ అయ్యేలా చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ప్రతి గ్రామంలోనూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థిని గుర్తించి మెంటారర్ గా వినియోగించే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పజెప్పాలని నిర్ణయించారు. వీరంతా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్ని ఆన్ లైన్ పాఠాలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి.. కేసీఆర్ సర్కారు ప్లాన్ ఎంతమేర వర్క్ వుట్ అవుతుందో చూడాలి.