ఏపీలో కరోనా కేసులు@1016

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నెల రోజులు పూర్తయింది. లాక్ డౌన్ విధించినపుడు దేశవ్యాప్తంగా వందల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీ నాటికి 24,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ కట్టుదిట్టంగా చేపట్టినప్పటికీ నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే ప్రమాదకర స్థాయిలో కేసుల సంఖ్య పెరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక, కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉంది.

తాజాగా, ఏపీలోని కేసులు వెయ్యి దాటాయి. గడచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. కర్నూలులో 14, గుంటూరులో 3, కడపలో 4, అనంతపురంలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాగా విజయనగరం తన రికార్డును కాపాడుకుంటోంది. కర్నూలులో అత్యధికంగా 275 పాజిటివ్ కేసులు నమోదు కాగా…గుంటూరులో 209 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఏపీలో కరోనా మృతుల సంఖ్య 31కి చేరింది. ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 814 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా…171 మంది కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. కాగా, పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,429 కేసులు నమోదు కాగా…. 57 మంది ప్రాణాలను కోల్పోయారు. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. వీరిలో 5,063 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కి చేరుకుంది.