కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే టైం వచ్చేసిందా?

మనం ఎంత అనుకున్నా.. కొన్నిసార్లు మనకు అంచనా లేని అంశాలు కొన్ని చోటు చేసుకుంటుంటాయి. పరిస్థితులన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని.. తమకు తిరుగులేదన్న భావన ప్రభుత్వాల్లో ఉంటుంది. అయితే.. ఊహించని విధంగా చోటు చేసుకునే పరిణామాలతో.. అప్పటివరకు ఉన్న అన్ని అంశాల ప్రాధామ్యాలు ఇట్టే మారిపోతుంటాయి.

కరోనా టైంలో రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేయటం ద్వారా.. యావత్ తెలుగు ప్రజలంతా తనను చూసేందుకు.. తన మాటల్ని వినేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

కరోనా మీద మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని సాధికారత తనకు మాత్రమే ఉందన్నట్లుగా ఆయన తీరు ఉండేది. అలాంటి ఆయన.. ఉన్నట్లుండి కరోనాను వదిలేయటం.. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోనట్లుగా ఉండటం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా.. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా.. పట్టించుకోనట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కేసీఆర్ కు ఇబ్బంది పెట్టేలా మారాయని చెప్పాలి. ఓపక్క కరోనా.. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు.. ఇవి సరిపోవన్నట్లుగా విరుచుకుపడిన భారీ వర్షాలతో పరిస్థితి మారింది.

సరిగ్గా ఇలాంటి టైంలోనే గవర్నర్ తమిళ సై గళం విప్పటం.. తెలంగాణ సర్కారు తీరుపై ఊహించని రీతిలో విమర్శలు చేయటమే కాదు.. కరోనా ఎపిసోడ్ లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట కేసీఆర్ ను ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. తనపై వచ్చిన విమర్శలకుసమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

అయితే.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ నోటి నుంచి రోటీన్ కు భిన్నంగా వచ్చిన వ్యాఖ్యలు ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపేలా ఉందని చెప్పక తప్పదు.ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం నేరుగా గవర్నర్ పై విమర్శలు చేయకున్నా.. తనదైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అయితే కేసీఆర్ కు ఉందన్నది మర్చిపోకూడదు. జరుగుగున్న పరిణామాలు చూస్తుంటే.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే ముహుర్తం దగ్గర్లోనే ఉందన్న అభిప్రాయం కలుగక మానదు.