సాయిధరమ్ తేజ్ ‘కొత్త’ సాహసాలు

Sai Dharam Tej

మూడు వరుస హిట్లతో ఒకప్పుడు మంచి రేంజిలో కనిపించాడు సాయిధరమ్ తేజ్. కానీ ఆ తర్వాత వరుసగా అరడజను డిజాస్టర్లతో మార్కెట్ అంతా కోల్పోయి దయనీయ స్థితికి చేరుకున్నాడు. అలాంటి సమయంలో అతడికి ‘చిత్రలహరి’ కాస్త ఉపశమనం అందించింది.

ఆ సినిమా మరీ పెద్ద హిట్టేమీ అయిపోలేదు కానీ.. మెగా కుర్రాడి పరాజయ పరంపరకు మాత్రం బ్రేక్ వేసింది. దాని తర్వాత తేజు నుంచి వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ బ్లాక్ బస్టర్ అయి అతడి కెరీర్‌కు మంచి ఊపు తెచ్చింది.

పోయిన మార్కెట్ అంతా ఈ సినిమాతో తిరిగొచ్చేసింది. తన కాన్ఫిడెన్స్ కూడా తిరిగి రావడంతో తేజు వరుసబెట్టి సినిమాలు ఓకే చేసి పడేస్తున్నాడు. అవన్నీ కొత్త దర్శకులు లేదంటే ఫాంలో లేని డైరెక్టర్లతోనే కావడం విశేషం.

సుబ్బు అనే కొత్త దర్శకుడిని నమ్మి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేశాడు తేజు. అది పూర్తయింది. ఈలోపు ఫాంలో లేని దేవా కట్టాతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ లైన్లో పెట్టాడు. ఇది ఇప్పటికే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇంతలో తేజు.. ఓ కొత్త దర్శకుడితో ‘భగవద్గీత సాక్షిగా’ అనే సినిమా చేయబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

ఆ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తారట. ఇంకా ఈ చిత్రం అనౌన్స్ కాలేదు. ఈలోపు వేరే చిత్రాన్ని ప్రకటించాడు తేజు. అది కూడా కొత్త దర్శకుడితోనే కావడం విశేషం. అతడి పేరు కార్తీక్ దండు. ఇతను సుకుమార్ శిష్యుడట.

‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇది హార్రర్ జానర్లో సాగే మిస్టరీ మూవీ అంటున్నారు. తేజునే స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రకటించాడు.