వైరల్: ఏపీలో పరిస్థితి చెప్పే షాకింగ్ ఫోటో

మాయదారి కరోనా.. మానవత్వం మర్చిపోయేలా చేస్తుంది. కన్న తల్లిదండ్రులు కరోనాతో చనిపోతే.. పట్టించుకోని పిల్లలు.. పట్టించుకుంటే తమకెక్కడ సోకి చనిపోతామన్న భయంతో వణికేలా చేస్తుంది. ప్రాణభయం వేళ.. మానవ సంబంధాలు ఎంత దారుణంగా మారతాయో చెప్పేస్తోంది కరోనా. తాజాగా ఏపీకి చెందిన ఒక ఫోటో వైరల్ గా మారింది. చూసినంతనే.. మరీ ఇంత దారుణమా? అనిపిస్తున్న ఈ ఫోటో ప్రభుత్వానికి ఇప్పుడు మింగుడుపడనిదిగా మారింది.

వ్యవస్థలోని లోపాల్ని బహిర్గతం చేయటమే కాదు.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు.. వాస్తవానికి మధ్య అంతరాన్ని తెలియజేస్తున్న ఈ ఫోటో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏమంటే.. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో కరోనాతో మరణించిన రోగిని.. అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు.

దీంతో.. అంతిమసంస్కారాల కోసం బల్ల రిక్షా మీద పడుకోబెట్టి.. తాళ్లు కట్టేసి.. తీసుకెళుతున్నారు. మృతదేహానికి.. దాన్ని తీసుకెళుతున్న రిక్షా బండి వ్యక్తికి పీపీఈ కిట్లు తొడిగేశారు. ఒంటరిగా.. అయిన వాళ్లు ఎవరు వెంట రాక.. ఒకడి దయతో శ్మశానానికి వెళ్లే దీనస్థితిని చూస్తే.. మనసు కలుక్కుమనక మానదు. అదే సమయంలో.. ఆ మధ్యన ఓకేసారి వందలాది అంబులెన్సుల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపిన వైనం తెలిసిందే.

మరి.. అంబులెన్సులు అందుబాటులో ఉన్నప్పుడు.. ఇలా బల్ల రిక్షాపై మృతదేహాన్ని తాళ్లతో కట్టేసి తీసుకెళ్లటం ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. సాటి మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలకు కనీస మర్యాద కూడా లేని సంస్కారం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవస్థలో జరుగుతున్న లోపాల్ని ముఖ్యమంత్రి జగన్ వెంటనే సరిచేయటం ద్వారా.. ఇలాంటివి మరోచోట జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వీలుంటుందన్న సూచనను పలువురు చేస్తున్నారు.