బ్రహ్మానందం బొమ్మ.. నేషనల్ లెవెల్లో వైరల్

Brahmanandam

2020 ఆగస్టు 5వ తేదీని దేశంలోని హిందువులు అంత సులువుగా మరిచిపోలేరు. దశాబ్దాల కల అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. బాబ్రీ మసీదును కూల్చేసిన చోట శతాబ్దాల క్రితం ఇక్కడ మందిరమే ఉండేదని.. ఆ స్థలం రాముడికే చెందుతుందని కొన్ని నెలల కిందట సుప్రీం కోర్టు అంతిమ తీర్పు ఇవ్వడం.. ఆ స్థలంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరగడంతో రామ భక్తులతో పాటు హిందువులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఉద్వేగంతో స్పందించారు. సెలబ్రెటీలు రకరకాల మార్గాల్లో తమ ఆనందాన్ని, ఉద్వేగాన్ని తెలియజేశారు. మన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం సైతం ఈ ఉద్వేగభరిత సందర్భంలో తన స్పందనను తెలియజేశారు.

బ్రహ్మానందం గొప్ప కమెడియన్‌గానే అందరికీ తెలుసు. కానీ ఆయనలో మంచి చిత్రకారుడూ ఉన్నాడు. ఈ విషయంలో గతంలోనే వెల్లడైంది. అందమైన కొన్ని చిత్తరువులతో బ్రహ్మి ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా సినిమా అవకాశాలు తగ్గిపోయి ఖాళీ అయిపోయాక తన చిత్ర కళకు బాగా పదును పెట్టుకున్నారాయన.

ఈ క్రమంలోనే రామాలయానికి భూమి పూజ జరిగిన నేపథ్యంలో ఆయనో బొమ్మ గీశారు. ఈ పెన్సిల్ ఆర్ట్.. వావ్ అనిపించేలా ఉంది. శ్రీరాముడిని కౌగిలించుకుని ఆనందభాష్పాలు రాలుస్తున్న ఆంజనేయుడి చిత్తరువది. సందర్భానికి తగ్గ ఎమోషన్‌ను క్యారీ చేసేలా ఉన్న ఈ బొమ్మ నిన్నట్నుంచి జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. డబ్బింగ్ సినిమాల ద్వారా బ్రహ్మి వివిధ భాషల్లో పాపులర్ కావడంతో ఆయన గీసిన బొమ్మ గురించి ఉత్తరాది వాళ్లు కూడా స్పందిస్తున్నారు.