జేసీ ప్రభాకర్.. ఆస్మిత్ లకు బెయిల్.. కానీ ట్విస్టు ఉందట

అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయ బలం జేసీ ఫ్యామిలీ సొంతం. తామేం అనుకుంటే అది జరిగిపోతుందన్న నమ్మకం వారికి చాలా ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోనే కాదు.. హైదరాబాద్ మహానగరంలోనూ వారి హవా ఓ రేంజ్లో సాగేది. అలాంటి వారిప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
బాబు హయాంలో వారు చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డిలు ఈ మధ్యన అరెస్టు కావటం తెలిసిందే.

కొద్ది కాలంగా తండ్రికొడుకులు ఇద్దరు కడప జైల్లో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జేసీ కుటుంబంలోని వారు ఇలా జైలుకు వెళ్లటం.. అన్నేసి రోజులు ఉండాల్సి రావటం కలలో కూడా ఊహించని విషయంగా చెబుతారు. అలాంటి వారిద్దరికి తగిలిన ఎదురుదెబ్బకు ఆ కుటుంబం తీవ్రమైన వేదనకు గురైనట్లు చెబుతారు. బీఎస్ 3 వాహనాల్ని బీఎస్ 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలతో పాటు.. పక్కా ఆధారాలతో దొరికినట్లుగా చెబుతారు.

వాహనాలకు బీమా విషయంలోనూ చట్టవిరుద్ధంగా సాగినట్లుగా చెబుతారు. ఈ నేపథ్యంలో అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.. వారిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. అనంతరం వారిని కడపకు తరలించటం తెలిసిందే. ఈ ఉదంతంలో పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బెయిల్ ప్రయత్నాలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

దీంతో వారు కడప జిల్లా జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా జరిపిన బెయిల్ ప్రయత్నాలు ఫలించాయి. వారిద్దరికి బెయిల్ లభించింది. దీంతో.. వారి జైలుకష్టాలు తీరినట్లుగా భావించారు. అయితే.. ఈ తండ్రి కొడుకుల మీద వేర్వేరు పోలీసుస్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఒక కేసులో జైలు నుంచి విడుదలైన వెంటనే.. మరో కేసులో అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

అదే జరిగితే.. కోర్టు నుంచి బెయిల్ పొంది ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందన్న మాట వినిపిస్తోంది. మరి..ఈ తండ్రి కొడుకుల లక్ ఎలా ఉందో పోలీసుల వైఖరి మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.