వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యం అమెరికా, ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమై భార‌త్ స‌హా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే క‌దులుతున్నాయి. జ‌నాల క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. ఈ క‌ష్టాల‌న్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైర‌స్‌ను పార‌దోలాలి. దాని కోస‌మే అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

ముందుగా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ లక్షల కోట్ల ఆదాయం అందుకుంటుందనడంలో సందేహం లేదు. దీని డిమాండ్ దృష్ట్యా ధర కూడా చాలా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐతే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్న సంస్థల్లో ఒకటైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనవాలా మాత్రం కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ రూ.వెయ్యి రేంజిలో ఉండొచ్చని.. అది రెండు డోస్‌లు అవసరం పడొచ్చని అన్నారు.

కానీ హైదరాబాద్ నుంచి కరోనా వ్యాక్సిన్ వృద్ధిలో చురుగ్గా ఉన్న భారత్ బయోటెక్ మాత్రం వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని చూస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా స్వయంగా వెల్లడించడం గమనార్హం. తెలంగాణ మంత్రి కేటీఆర్.. వ్యాక్సిన్ల తయారీ విషయమై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. కొవాగ్జిన్ పేరుతో తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని ఆయన తెలిపారు. కొత్త వైరస్‌ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయని తెలిపారు.

తాము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చు.. కానీ తమ అందరి పోరాటం కరోనాను జయించడమే అని చెప్పిన కృష్ణ ఎల్లా ప్రపంచంలో ఏ వ్యాక్సిన్‌ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదన్నారు. వాటర్‌ బాటిల్‌ ధర కంటే తక్కువ ధరలోనే కరోనా వ్యా్క్సిన్‌ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని.. భారత్‌లో ఇచ్చే వ్యాక్సిన్‌, విదేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్‌ ఒకే నాణ్యతతో ఉంటుందని చెప్పారు.