బయటికెళ్తున్నారా… ఈ రూల్ తెలుసుకోండి

దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి, ఎవ్వరూ ఇళ్లు దాటి బయటికి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. అలాంటివారి కోసం మరో సరికొత్త రూల్ అమలులోకి తెచ్చారు తెలంగాణ పోలీసులు. ఎవ్వరైనా బయటికి వచ్చి, మూడు కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే, వారిని గుర్తించి భారీ జరిమానా విధించబోతున్నారు.

హైదరాబాద్ నగరంలో 250 జంక్షన్లలో కొన్ని వేల సీసీ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీంతో ఎవ్వరైనా ఇంటి నుంచి 3 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే, వారికి రూల్స్ అతిక్రమించినందుకు భారీగా ఫైన్ వసూలు చేయబోతున్నారు. బుధవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కార్లు, బైక్స్ ఈ రూల్‌ను అతిక్రమించి, బయట రోడ్ల మీద తిరిగినట్టు గుర్తించారు పోలీసులు. ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసినా, అనవసరంగా బయటికి రావద్దని చెప్పినా పట్టించుకోకుండా చాలామంది రోడ్లపైకి వస్తున్నారని తేలింది. ఇలా బయటికి వచ్చినవారిలో కొందరు రోడ్లపైన టిక్ టాక్ వీడియోలు చేస్తూ, సెల్ఫీలు తీసుకోవడం కూడా పోలీసులు గుర్తించారు.

ఇలాంటివారి భరతం పట్టేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ విధంగా ముందుకు సాగనుంది. లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించేవారికి భారీ జరిమానా విధించడంతో పాటు మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించేందుకు కూడా పోలీసులు వెనుకాడడం లేదు. సో… ఇంట్లో బోర్ కొడుతోంది కదా! అని అలా తిరిగొద్దామని బయటికి వెళ్లేందుకు ఓ సారి ఆలోచించండి.