వీర్రాజు వ‌చ్చారు…బీజేపీ నేత‌ల బీపీ పెంచేస్తున్నారు

సోము వీర్రాజు…ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీకరించిన పార్టీ సీనియ‌ర్ నేత‌. ఆయ‌న ఎంట్రీతోనే త‌న వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత అధికార ప‌క్షం, గ‌తంలో ప‌రిపాలించిన టీడీపీ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాల‌ను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషిచేస్తామన్నారు.

పోలవరం నిధులు రాబట్టడానికి సహకరిస్తామంటూనే గతంలో ఇచ్చిన దానికి లెక్కలు రావాలన్నారు. వైసీపీ టీడీపీలు రెండు కళ్లయితే తాము త్రినేత్రులుగా వ్యవహరిస్తామన్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా, బీజేపీలోని నేత‌ల‌కు సైతం వీర్రాజు బీపీ పెంచేస్తున్నార‌నే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి విష‌యంలో ఆయ‌న ఇచ్చిన త‌క్ష‌ణ కౌంట‌ర్ దీనికి నిద‌ర్శనం.

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇంకా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని అన్నారు. అమరావతి రైతులు, కోర్టులు చూస్తూ ఉండవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో..సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేంద్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

పోలవరం…కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే… అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. శాస‌న మండ‌లి ఆమోదించకుండా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ కి పంపడమే రాజ్యాంగ విరుద్ధమని సుజ‌నా చౌద‌రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెంట‌నే దీనిపై స్పందించారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతున్నారన్న వీర్రాజు ఆ విషయంలో ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోలేదని తేల్చిచెప్పారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అని చంద్రబాబు కథలు చెప్పారని, చంద్రబాబు మాటల పై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని చెప్పుకొచ్చారు.

కాగా, గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా లక్ష్మినారాయణ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వివిధ ప్రకటనలు చేయడం ఆ వెంటనే జివిఎల్‌ నరసింహరావు, రాం మాధవ్‌ వంటివారు భిన్నస్వరం వినిపించడం తెలిసిన సంగ‌తే. తాజాగా, ఢిల్లీ నేత‌ల వ‌ద్ద‌కు ఎపిసోడ్ వెళ్ల‌కుండా వీర్రాజే నేరుగా ఎంట్రీ ఇచ్చి వెంట‌నే కౌంట‌ర్లు ఇస్తున్న నేప‌థ్యంలో వీర్రాజు కాక పెంచేస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.