ఏపీలో కరోనా విలయం… ఆగస్టులో 10 లక్షల మార్క్ కు కేసులు?

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో తనదైన రీతిలో విస్తరిస్తోంది. ఆదిలో రోజుకు సింగిల్, డబుల్ డిజిట్ కొత్త కేసులు నమోదైతేనే భయపడిపోయిన ఏపీ వాసులను.. ఇప్పుడు ఏకంగా రోజుకు 10 వేల కొత్త కేసులు నమోదైపోతుండటం మరింతగా భయపెడుతోంది.

బుధవారం ఒక్కరోజే ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగించే అంశమేనని చెప్పాలి. అయితే గడచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే… అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు జనం కూడా జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఆగస్టులో కరోనా విలయతాండవం చేసే ప్రమాదం లేకపోలేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న మాదిరి పరిస్థితులే ఉంటే… ఆగస్టులో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న గణాంకాలను బట్టి చూస్తేనే… ఆగస్టులో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. సరిగ్గా బుధవారానికి 14 రోజుల ముందు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30 వేలకు దిగువగానే ఉంది. అయితే ఈ 14 రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య అనూహ్యంగా 1.20 లక్షలకు చేరిపోయింది. అంటే… 14 రోజుల క్రితం నాడు కరోనా బాధితులుగా ఉన్న 30 వేల మంది ద్వారా ఏకంగా 90 వేల మందికి వైరస్ వ్యాప్తి చెందిందన్న మాట.

ఈ కొత్తగా చేరిన బాధితులు… అంతకుముందు కరోనా బారిన పడిన వారి కుటుంబ సభ్యులైనా కావచ్చు. లేదంటే వారికి సన్నిహితంగా మెలగిన ఇతరులైనా కావచ్చు. మొత్తంగా 30 వేల మంది బాధితులు కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 90 వేల మందికి వైరస్ ను అంటించేశారన్న మాట. అంటే… ఒక్కో బాధితుడు సగటున నలుగురికి ఈ వైరస్ ను అంటించేశాడన్న మాట.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే… మరో 14 రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరిపోవడం అంత కష్టమేమీ కాదన్న మాట వినిపిస్తోంది. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత ఫలవంతం కావడం, ప్రజలు శుభ్రత, భద్రత విషయంలో మరింత జాగ్ర్తత్తగా వ్యవహరిస్తేనే వైరస్ వ్యాప్తిని నిలువరించే అవకాశం ఉందన్న మాట.

అలా కాకుండా ఇప్పుడున్న నిర్లక్ష్య ధోరణే ఇక ముందు కూడా కొనసాగితే… కేసుల సంఖ్య 10 లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే… కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే… ఇటు ప్రభుత్వం తరఫున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా తమ కుటుంబాలను కాపాడుకునే విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించక తప్పదని చెప్పక తప్పదు.