రాయపాటికి కొత్త చిక్కులు.. బ్యాంకుల వేలంతో ఉక్కిరిబిక్కిరి

సీనియర్ రాజకీయనేతగా సుపరిచితుడు రాయపాటి సాంబశివరావు టైం ఏ మాత్రం బాగున్నట్లు కనిపించట్లేదు. తాజాగా ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వ్యాపారవేత్తలుగా రాణించిన రాజకీయ నేతల తొలితరానికి నిలువెత్తు రూపంగా రాయపాటిని అభివర్ణిస్తారు. అలాంటి ఆయన హామీదారుగా ట్రాన్స్ ట్రాయ్ లిమిటెడ్ సంస్థ పలు బ్యాంకుల వద్ద అప్పులు చేసింది. వీటి విలువ వందల కోట్లుగా ఉండటం గమనార్హం.

సెంట్రల్ బ్యాంకు వద్ద సుమారు రూ.452 కోట్లకు పైనే ట్రాన్స్ ట్రాయ్ బకాయి పడింది. తీసుకున్న అప్పును తీర్చకపోవటంతో బ్యాంకు సైతం పలుమార్లు తన అప్పును రాబట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ సాధ్యం కాకపోవటంతో రుణానికి హామీగా పెట్టిన ఆస్తుల్ని వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తనఖా పెట్టిన రాయపాటి ఆస్తుల్ని వేలం వేస్తామని..ఈ బిడ్డింగ్ లో పాల్గొనాలని భావించే వారు ఆగస్టు పద్నాలుగు లోపు బిడ్స్ దాఖలు చేయాలని కోరింది.

2017 జనవరి తొమ్మిది నాటికి సెంట్రల్ బ్యాంకు ట్రాన్ ట్రాయ్ చెల్లించాల్సిన మొత్తం రూ.452.41 కోట్లు. వీటికి రాయపాటితో పాటు.. ట్రాన్స్ ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్ తో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అప్పు మాత్రమే కాదని.. ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లోని కెనరా బ్యాంకుల నుంచి మరో రూ.300 కోట్లు మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది.

ఓవైపు కేసులు.. మరోవైపు వేలం నోటీసులు.. ఇలా వచ్చి పడుతున్న తిప్పలతో రాయపాటి తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఓకే కానీ.. వయసు మీద పడి.. మంచి పదవుల్ని చేపట్టాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావటం ఇబ్బందికరమని చెప్పక తప్పదు. ఒకప్పుడు రాజకీయాల్ని ఏలిన పెద్ద మనిషి ఆస్తుల్ని బ్యాంకులు వేలం వేయటానికి రావటానికి మించిన ఇబ్బంది మరింకేమీ ఉంటుంది చెప్పండి?