కేసీఆర్ కలల సచివాలయంలో అంతా ‘6’

తాను కలలు కన్న తెలంగాణ నూతన సచివలయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన నమూనాకు కొన్ని మార్పులు చేర్పులు చేయటం తెలిసిందే. తాజాగా మరిన్ని మార్పుల్ని చేసినట్లుగా చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ కు అభిముఖంగా ఠీవీగా ఉండేలా సచివాలయాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతేనా.. సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబరుగా భావించే ‘ఆరు’కు సచివాలయ నిర్మాణంలో పెద్ద పీట వేయనున్నారు. ప్రతి అడుగులోనూ ఆరు అంకె కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారా? అన్న భావన కలిగేలా అంశాలు కనిపించటం గమనార్హం.

నూతన సచివాలయం చుట్టూ గతానికి భిన్నంగా ఏకంగా 60 అడుగుల వెడల్పుతో రోడ్లను డెవలప్ చేయనున్నారు. మొత్తం నిర్మాణం ‘6’ లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘6’ అంతస్తుల్లో నిర్మాణం చేయనున్నారు. ఈ భారీ భవనం మధ్యలో పద్నాలుగు అంతస్తుల ఎత్తులో గుమ్మటం వచ్చేలా నమూనాను సిద్ధం చేశారు. ‘6’ అంతస్తుల్లో నాలుగు అంతస్తుల మేర ఆఫీస్ స్పేస్ ఉండేలా నిర్మించనున్నారు. మరో నాలుగు అంతస్తుల ఎత్తులో గుమ్మటం ఉండనుంది. కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.500 వందల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు ముగిసే సమయానికి ఖర్చు విషయంలో మార్పులు జరిగే వీలేందని చెబుతున్నారు.

అంతేకాదు.కేసీఆర్ లక్కీ నెంబరు ఆరు అన్ని చోట్ల వచ్చేలా ప్లాన్ చేసినట్లుగా చెప్పాలి. సచివాలయంలో నిర్మించే ‘‘6’’ కాన్ఫరెన్స్ హాళ్లు.. ‘‘6’’ డైనింగ్ హాళ్లు.. ‘‘6’’ పార్కులు.. ‘‘60’’ మీటర్ల గుమ్మటం ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ ‘ఆరు’ మిస్ కాకుండా ఉండటం గమనార్హం. మొత్తంగా కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కొత్త సచివాలయంలో ఏ మూల చూసినా.. ‘6’ అంకె కొట్టొచ్చినట్లు కనిపించేలా ఉండటం విశేషంగా చెప్పక తప్పదు.

చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ లు ఆస్కార్ ..పొన్నిలు.. ఈ నిర్మాణాన్ని తమ ఆలోచనలకు తగ్గట్లుగా రూపొందించనున్నారు. సీఎం కేసీఆర్ తాజాగా చేసిన మార్పులకు వచ్చే వారంలో ఆమోదం పొందనుంది. కూల్చేసిన సచివాలయానికి ఉత్తర.. తూర్పున రహదారులు ఉన్నాయి. అదే రీతిలో పశ్చిమం.. దక్షిణం వైపున రోడ్లు ఉండేలా ప్లాన్ చేశారు. సౌత్ వైపు రోడ్డు వైపుగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఇప్పటికే కేసీఆర్ చెప్పినట్లుగా ఈ ప్రాంతంలోనే ప్రార్థనా మందిరాలు.. బ్యాంకు.. పోస్టాఫీసు.. ఆసుపత్రి.. చిన్నారుల సంరక్షణ కేంద్రాలు.. ఉద్యోగ సంఘాల కార్యాలయాలు.. సందర్శకులు వేచి ఉండేందుకు హాలు లాంటివి ఉండనున్నాయి. ఇప్పటికే నమూనాను సీఎం కేసీఆర్ అనధికారికంగా ఓకే చెప్పారు.అధికారికంగా వారంలో నమూనాకు ఆమోదముద్ర పడనున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే నెల వ్యవధిలోనే టెండర్లు ఖరారు చేస్తారని చెబుతున్నారు.కేవలం పది నెలల సమయంలోనే సరికొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.