అమరావతి ఎపిసోడ్ లోకి కేంద్రాన్ని తీసుకొచ్చిన హైకోర్టు

ఏపీ సర్కారుకు ఇబ్బందికర నిర్ణయం ఒకటి ఏపీ హైకోర్టు నుంచి వెలువడింది. తాము అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న నిర్ణయంతో పాటు సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీంతో.. అమరావతి అంశంపై కేంద్రాన్ని హైకోర్టు ఇన్ వాల్వ్ చేసినట్లైంది.

ఇటీవల కాలంలో జగన్ సర్కారు తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి ఏపీ హైకోర్టు స్పందిస్తున్న తీరు తెలిసిందే. దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎత్తి చూపటం ద్వారా.. రూల్ బుక్ కు తగ్గట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి వేళ.. తాజాగా ఏపీ రాజధాని అమరావతితో పాటు మరో రెండు చోట్ల కూడా రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కారు నిర్ణయానికి కేంద్రం తన వాదనను వినిపించాలని కోరటం.. కీలక పరిణామాలకు తెర తీసినట్లేనని చెప్పక తప్పదు.

రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. దానిపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. దీంతో.. అమరావతిపై కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోర్టు కోరింది. ఈ సాంకేతిక అంశం జగన్ సర్కారుకు తెలీదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

పిటిషనర్ పేర్కొన్నట్లుగా రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది అయినప్పుడు.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా.. వారి అనుమతి తీసుకోకుండా బిల్లును అసెంబ్లీలో పాస్ చేయటం ద్వారా జగన్ సర్కారు తప్పే చేసినట్లు అవుతుంది. ఇంతకాలం సీన్లో లేని కేంద్రం.. ఏపీ హైకోర్టు పుణ్యమా అని ఇప్పుడు వచ్చిన పరిస్థితి. దీంతో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.