కొర‌టాల కౌంట‌ర్‌.. మ‌న సీఎంల సంగ‌తేంటి?

ఇండియాలో క‌రోనా తీవ్ర‌త రోజు రోజుకూ పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రోజూ వేల‌ల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో అయితే గ‌త కొన్ని రోజులుగా 4-5 వేల మధ్య క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

అయినా స‌రే.. ఇప్ప‌టికీ జ‌నాలు అజాగ్ర‌త్త‌గానే ఉంటున్నారు. మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజ‌ర్లు వాడ‌టంతో అలక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌కు ఎంత చెప్పినా ఫ‌లితం ఉండ‌ట్లేదు. దీంతో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు కోపం వ‌చ్చింది. ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం చేసుకోకుండా.. ఇప్ప‌టికీ మాస్కులు ధ‌రించే విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించేవాళ్ల‌కు చురుక్కుమ‌నిపించేలా ఒక ట్వీట్ వేశారాయ‌న‌.

ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం… ఇదీ కొర‌టాల వేసిన ట్వీట్. అయితే ఆ ట్వీట్‌కు నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర రిప్లైలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తాజా ఫొటోల‌ను షేర్ చేశారు. చుట్టూ ఉన్న వాళ్లంద‌రూ మాస్కులు ధ‌రించి ఉంటే.. కేసీఆర్, జ‌గ‌న్ మాత్రం మాస్కుల్లేకుండా ఉన్నారు.

క‌రోనా మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి ఇదే వ‌ర‌స‌. అంద‌రికీ జాగ్ర‌త్త‌లు చెబుతూ, హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ వాళ్లు మాత్రం మాస్కులు ధ‌రించ‌ట్లేదు. త‌మ కార్యాల‌యాల్లో పాటించే జాగ్ర‌త్త‌లపై భ‌రోసా.. క‌రోనా వ‌చ్చినా త‌మ‌కు అత్యుత్త‌మ కేర్ ఉంటుంద‌న్న ధీమా ఉండొచ్చు కానీ.. జ‌నాల‌కు స‌రైన సంకేతాలివ్వ‌డం కోస‌మైనా తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాస్కులు ధ‌రించాల‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. మ‌న‌ ప్ర‌ధాని మోడీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు కూడా మాస్కులు ధ‌రిస్తున్న విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.