మోడీ మోతకే హడలిపోతుంటే.. ఈ బాదుడేంది జగన్?

Jagan

కోరకుండానే వరాలు ఇచ్చే దేవుళ్లుగా మారుతున్న అధినేతలు.. అదే సమయంలో ప్రజలు వీపులు విమానం మోత మోగేలా బాదేస్తున్న వైరుధ్యం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంక్షేమ పథకాల పేరుతో వందలాది కోట్లను వరాలుగా ఇచ్చేస్తున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పన్ను బాదుడు బాదేయటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ఠంగా ఉన్నవేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు తీరుతో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో లీటరు డీజిల్ ధర రూ.80కు చేరుకోవటంలో మోడీ మాష్టారికే క్రెడిట్ ఎక్కువగా ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని పూడ్చుకునేందుకు వీలుగా పెట్రోల్.. డీజిల్ మీద పన్ను భారాన్ని భారీగా పెంచేయటం ఈ మధ్యన చూస్తున్నదే. ఇటీవల అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ మంటలకు ఆజ్యం పోసేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యాట్ భారాన్ని మరింత పెంచేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్ పై రూ.1.24.. లీటరు డీజిల్ పై 97 పైసల వ్యాట్ భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకన్నారు. దీని పుణ్యమా అని లీటరు పెట్రోల్ మీద 31 శాతంగా మారింది. డీజిల్ మీద విధిస్తున్న 22.5 వఆతం వ్యాట్ కు అదనంగా మరింత వ్యాట్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వేళలో రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ మీద పన్నును పెంచుతున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులకు తగ్గట్లే పెట్రోల్.. డీజిల్ మీద పన్నుభారాన్ని పెంచినట్లుగా వెల్లడించింది. తాజాగా పెంచిన పన్ను పోటు పుణ్యమా అని నిత్యవసర వస్తువుల మొదలు అన్నింటి ధరలు పెరగటం ఖాయమంటున్నారు. తాజాగా పెంచిన పన్నుకారణంగా సరకు రవాణా మీద ప్రభావాన్ని చూపనుంది. ఇది..సామాన్య.. మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందిగా మారనుంది.