సుహాసిని కోసం చిరు గన్ను తీసిన వేళ..

సోషల్ మీడియా జనాలు వాదించుకోవడానికి, నిందలేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ ఉండాల్సిందే. తాజాగా మెగా, నందమూరి అభిమానుల మధ్య ఒక గొడవ నడుస్తోంది. 1993లో తెలుగు సినీ తారలు ప్రయాణిస్తున్న విమానంలో ఇబ్బంది తలెత్తి, తిరుపతి సమీపంలోని పొలాల్లో అది దిగిపోవడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఒక దశలో తమ ప్రాణాలు మిగలవన్న భయంతో సినీ తారలు తీవ్ర ఆందోళనకు గురైన సందర్భంలో ఎవరెలా స్పందించారనే విషయంలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరేమో చిరంజీవి అప్పుడు హీరోలా వ్యవహరించాడంటే.. ఇంకొందరేమో బాలయ్య హీరోయిజం చూపించాడంటున్నారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు నడుస్తున్నాయి.

బాలయ్య ఫ్యాన్స్ ఏమో.. నాలుగేళ్ల కిందట లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు బాలయ్య విమానంలో ఎంత వీరోచితంగా వ్యవహరించాడో సీనియర్ నటి శారద చెబుతున్న వీడియోను షేర్ చేశారు. మరోవైపు చిరు అభిమానులు.. ఆయన గురించి ఈ మధ్య సుహాసిని గొప్పగా మాట్లాడిన వీడియోను తీసుకొచ్చారు. చిరుతో వీడియో కాల్ మాట్లాడుతూ.. సుహాసిని ఒక సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లినపుడు తమకు ఎదురైన భయానక అనుభవం గురించి వెల్లడించింది.

కొందరు ఆకతాయిలు రోడ్డు మీద తప్ప తాగి తాము ప్రయాణిస్తున్న కారు మీదికి బీర్ బాటిళ్లు విసిరారని.. అప్పుడు చిరు కారు ఆపి తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసి వాళ్లకు గురి పెట్టాడని.. దీంతో వాళ్లు భయపడి పారిపోయారని.. చిరు స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా హీరోనే అనడానికి ఇది రుజువని సుహాసిని చెప్పిందా వీడియోలో. ఇప్పుడు సందర్భం ఏదైనప్పటికీ.. చిరు నిజ జీవితంలో గన్ను పట్టిన ఈ ఉదంతం గురించి మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.