ఏపీ కొత్త జిల్లాలతో ఇలాంటి సిత్రాలకు కొదవ లేదట

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఇప్పటికే పలు హామీల్ని అమలు చేసిన ఆయన.. తాజాగా ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కొత్త జిల్లాలపై కసరత్తుకు కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. కొత్త జిల్లాలకు సంబంధించిన ఎన్నో అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకున్న ప్రాతిపదిక చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ.. ఆచరణలోకి వస్తే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న సింఫుల్ స్టేట్ మెంట్ వెనుక ఎన్నోకీలకాంశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సూత్రాన్ని అమలు చేస్తే ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన కొత్త సమస్యలు ఎదురుకావటం ఖాయమంటున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి భౌగోళిక సమస్యలతో పాటు.. మరెన్నో అంశాలు తోడు కానున్నాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లాలోని బాపట్ల లోక్ సభ స్థానాన్ని తీసుకుంటే.. ఈ లోక్ సభ స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన చీరాలతో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.

వాస్తవానికి గుంటూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ప్రకాశంజిల్లాలోనివే ఎక్కువ. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ప్రకాశం జిల్లా వారికి గుంటూరు జిల్లా వారిగా అనిపించుకోవటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందునా.. ప్రకాశం జిల్లా వారికి వారి జిల్లా మీద ఉండే అభిమానం మిగిలిన వారి కంటే రెండింతలు ఎక్కువ. ప్రకాశం జిల్లా లాంటి చాలా జిల్లాలు ఏపీలో ఉన్నాయి.

ఇప్పటివరకూ తామున్న జిల్లా నుంచి మరో కొత్త జిల్లా వాడిగా అనిపించుకోవటానికి ససేమిరా అనే వారు బోలెడంత మంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకూ సీమకు చెందిన వారు కాస్తా.. తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేనా.. తాము ‘కృష్ణా’ జిల్లా వాళ్లమని గొప్పగా చెప్పుకునే వారు.. తమకేమాత్రం సంబంధం లేని గోదావరి జిల్లాలో భాగం కావటం వారికి ఇష్టముండదు. అదే సమయంలో ‘కృష్ణా’జిల్లాకు చెందిన వారిని తమతో కలుపుకోవటానికి గోదావరి జిల్లాల వారు స్వాగతించలేని పరిస్థితి.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి జిల్లా ఏర్పాటులోనూ పాజిటివ్ ల కంటే నెగిటివ్ లే ఎక్కువని చెప్పాలి. భౌగోళిక విభజన ఎన్నో భావోద్వేగాల్ని తీసుకురావటమే కాదు.. తమకు ఏ మాత్రం సంబంధం లేని వారిని మోయాల్సి రావటాన్ని జీర్ణించుకోవటం కష్టమనే చెప్పాలి. మరింతటి పెద్ద విషయాన్ని తలకెత్తుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంతిమంగా ఎలా డీల్ చేస్తారన్నది పెద్ద సవాలేనని చెప్పక తప్పదు.