తెలంగాణ కరోనా బులిటెన్ మారిపోయింది

ఎన్ని విమర్శలు వచ్చినా, హైకోర్టు హెచ్చరికలు చేసినా.. కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి ఇష్టపడలేదు తెలంగాణ సర్కారు. కానీ ప్రజల్లో ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడం, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తీరు మారింది. ఏపీ తరహాలోనే ర్యాపిడ్ కిట్లు తెచ్చి కొన్ని రోజులుగా రోజుకు పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తున్నారు.

మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంపై, వసతుల లేమిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపించడంతో ఈ విషయంలోనూ స్పందించింది. పరిస్థితులు సరిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా వైరస్ స్టేటస్‌కు సంబంధించి రోజూ రిలీజ్ చేసే బులిటెన్ తీరును కూడా మార్చింది తెలంగాణ సర్కారు.

ఇంతకుముందులా అస్పష్టంగా కాకుండా వివరంగా బులిటెన్ ఇస్తోంది ప్రభుత్వం. ఇందులో కొత్త కొత్త కాలమ్స్ చేర్చింది. కరోనా పరీక్షల గురించి ఒక ప్రత్యేక కాలమ్ పెట్టింది. టెస్టుల సంఖ్య భారీగా పెంచిన నేపథ్యంలో ఆ వివరాలన్నీ అందులో పొందు పరిచింది. గత పది రోజుల లెక్కల వల్ల ఈ గణాంకాల్లో చాలా మార్పు కనిపించింది. ఇప్పుడిక్కడ టెస్టుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది.

గురువారం ఒక్క రోజే 14 వేలకు పైగా పరీక్షలు చేయడం విశేషం. ఇందులో 1676 పాజిటివ్ కేసులు తేలాయి. మొత్తం కేసుల సంఖ్య 41 వేలకు పైగా ఉంది. అందులో 25 వలే మంది దాకా కోలుకున్నారు. 13 వేలకు పైగా యాక్టివ్ కుసులున్నాయి. మరోవైపు కోవిడ్ ఆసుపత్రి అయిన గాంధీలో అందుబాటులో ఉన్న బెడ్లు ఇతర వివరాల్ని కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల వివరాల్ని కూడా బులిటెన్లో ఇస్తుండటం విశేషం.