ఇంకా చంద్రబాబు చెప్పినట్లుగానే టీటీడీ ఈవో: రమణదీక్షితులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గౌరవ అధ్యక్షులు రమణదీక్షితులు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ వేదికగా ఆయన ఈవో పైన ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ట్వీట్‌లో సీఎం జగన్‌తో పాటు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కూడా యాడ్ చేశారు.

చంద్రబాబు హయాంలో ఇరవైమందికి పైగా అర్చకులను రాజ్యాంగ విరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. జగన్ కూడా తమని మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ ఈవో, ఏఈవోలు చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటూ… హైకోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికీ ఎదురు చూస్తున్నామన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం కూడా రమణదీక్షితులు చేసిన ట్వీట్ కలకలం రేపింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. త్వరలో తిరుమల కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి విముక్తి పొందుతుందని ఆకాంక్షించారు.