ప్రభాస్‌ను నార్త్ బ్యాచ్ లైట్ తీసుకుందా?

‘బాహుబలి’తో అలాంటిలాంటి ఇమేజ్ సంపాదించలేదు ప్రభాస్. ఒకేసారి అతడి ఫాలోయింగ్, మార్కెట్ పది రెట్లకు పైగా పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు ముందు రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉన్న ప్రభాస్ సినిమాల బడ్జెట్, మార్కెట్.. దీని తర్వాత అంతకు పది రెట్లకు పైనే పెరిగింది.

ఆ సంగతి ‘సాహో’తోనే రుజువైంది. దాని బడ్జెట్, బిజినెస్ లెక్కలు ఏ రేంజికి వెళ్లాయో తెలిసిందే. ఉత్తరాదిన ప్రభాస్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం, అక్కడతడికి పెద్ద ఎత్తున మార్కెట్ రావడం ఇందుక్కారణం.

‘సాహో’ సినిమా ఓవరాల్‌గా చూస్తే డిజాస్టర్ అయినా సరే.. ఆ చిత్రం హిందీలో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అక్కడి వరకు ‘హిట్’ స్టేటస్ అందుకుంది. ఇది చూసి ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్, ఫాలోయింగ్ చెక్కు చెదరలేదనే అంతా అనుకున్నారు.

కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ రిలీజైన సందర్భంగా సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే.. ఈ సినిమా విషయంలో ఉత్తరాది జనాల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ లేదేమో అనిపిస్తోంది. ‘సాహో’ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు రిలీజైనపుడు ఉత్తరాది వాళ్ల హంగామా మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్ మాస్ ఆడియన్స్‌కు ‘సాహో’ పట్ల ప్రత్యేక ఆసక్తి కనిపించింది.

కానీ ‘రాధేశ్యామ్’ ఒక ప్రేమకథ కావడం, ఇందులో మాస్ అంశాలుండే సంకేతాలేమీ లేకపోవడం, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సాధారణంగా కనిపించడంతో నార్త్ జనాలు దీన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి పీఆర్వోలు కూడా దీని విషయంలో పెద్దగా హంగామా చేయలేదు.
మీడియా కూడా ఈ ఫస్ట్ లుక్ గురించి పెద్దగా ఆర్టికల్స్ రాయడం, విశ్లేషణ చేయడం లాంటివి చేసినట్లు కనిపించలేదు. ప్రధానంగా ప్రభాస్ కొత్త సినిమాలో మాస్ అంశాలు లేకపోవడమే ఈ అనాసక్తికి కారణమేమో అనిపిస్తోంది.