రఘురామకృష్ణంరాజుతో మైండ్ గేమ్ మొదలు పెట్టిన జగన్

పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు.

రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు అందుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ధిక్కారస్వరం వినిపిస్తున్న సొంత ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకుముందు మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌లు కూడా వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.

నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు… రఘురామపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా తనపై చర్యలు తీసుకోలేనివిధంగా పక్కా ప్లాన్‌తో పావులు కదిపిన రఘురామతో జగన్ ఇప్పుడు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన విమర్శలు గుప్పించిన నరసాపురం లోకసభ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేసులు పెట్టిస్తుండటం గమనార్హం.

గతంలో వదిలేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక అధిష్టానం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదివరకే వైసీపీ ఎంపీలు.. రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఫిర్యాదు వెళ్లింది.