కేసీఆర్ పాలన పై సై అంటోన్న తమిళ`సై

తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ల మధ్య సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక విషయాలకు వీరిద్దరూ ప్రాధాన్యతనివ్వడ కావచ్చు….పాలన పరంగా కేసీఆర్ తో నరసింహన్ ఎప్పుడూ విభేదించకపోవడం కావచ్చు…ఏదైనా కానీ, వారిద్దరి మధ్య పెద్దగా విభేదాలు వచ్చినట్లు కనబడలేదు. అయితే, ప్రస్తుత గవర్నర్ తమిళ సైతో కేసీఆర్ కు పెద్దగా పొసగలేదన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

ప్రధాని మోడీపై కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత ఏరికోరి తమిళసైని తెలంగాణకు కేంద్రం పంపిందని వినికిడి. ఇక, అందుకు తగ్గట్లుగానే సందర్భాన్ని బట్టి కేసీఆర్ , తమిళసైల మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడుతోంది. మొదట్లో తమిళసైని పొగిడినట్లు కనిపించిన కేసీఆర్….ఆ తర్వాత తమిళసై అంటే గిట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. ఇందుకు, పాలనలో తమిళసై జోక్యం చేసుకోవడం….ఓ రకంగా సమాంతరపాలన చేయడం కారణమని తెలుస్తోంది.

కరోనాకు ముందు కేసీఆర్ సర్కారు పనితీరును ప్రశంసించిన గవర్నర్ తమిళ సై.. ఇప్పుడు దాదాపు సమాంతర పాలనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శితో తమిళసై భేటీ, ట్విట్టర్‌లో నెటిజన్లతో సంభాషించడం, నేరుగా ప్రైవేటు ఆసుపత్రుల యజమానులతో కరోనా కేసుల చార్జిలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం వంటి చర్యలు కేసీఆర్ కు మింగుడుపడడం లేదు.

రాజ్‌భవన్‌కు రావాలని తమిళసై పిలిచినా… సీఎస్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాలేదంటే ఆ గ్యాప్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చాన్సలర్ హోదాలో, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ను తమిళసై పిలిపించడంతో…ఆయనపై బదిలీ వేటు పడింది. కేసీఆర్ దర్శనం కలగని విపక్షాలతో 25 సార్లు తమిళ సై భేటీ అయ్యారు. దివంగత కల్నల్ సంతోష్ భౌతికకాయానికి హకీంపేట ఎయిర్‌పోర్టులోనే తమిళ సై సెల్యూట్ కొట్టారు.

ఇక, సీఎం కేసీఆర్ కనీసం ఇంటికి వెళ్లి కూడా సంతోష్ భౌతిక కాయాన్ని సందర్శించకపోవడంపై విమర్శలు వచ్చాయి.కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నివేదికలివ్వాలని, గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను కేసీఆర్ సర్కారు బేఖాతరు చేసింది. నిమ్స్‌కు వెళ్లి డాక్టర్లకు ధైర్యం చెప్పిన తమిళసై రాష్ట్రంలో కరోనా టెస్టులు పెరగాల్సిన అవసరం ఉందని డైరెక్ట్ గానే సీఎం కేసీఆర్ తీరును తప్పుబట్టారు.

సీఎం కేసీఆర్ దర్శనం ఎమ్మెల్యేలు, మంత్రులకు అంతంత మాత్రమే. అటువంటిది ప్రజా సమస్యలు వినేందుకు కేసీఆర్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాబట్టి, ప్రజలు తమ సమస్యలు వివరించేందుకు ఎవరిని కలవాలో అర్ధం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే.. కొద్దిరోజుల్లో తమిళ సై ప్రజాదర్బార్లు నిర్వహించి, ప్రజల సమస్యలు వినాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన కుముద్‌బెన్ జోషి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరించారట. ఎన్టీఆర్ కు సమాంతరపాలనను సాగించిన కుముద్‌బెన్ జోషి దర్బార్లు నిర్వహించేవారట. ఒకవేళ తమిళసై ప్రజా దర్బార్ నిర్వహిస్తే.. కేసీఆర్ సర్కారుకు ఆమె పక్కలో బల్లెం అయినట్లే నని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.