జబర్దస్త్‌ను మళ్లీ ఆపేశారా?

లాక్ డౌన్ కారణంగా అన్ని టీవీ కార్యక్రమాల్లాగే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కామెడీ షో ‘జబర్దస్త్’ కూడా ఆగిపోయింది. అప్పటికే చిత్రీకరించిన కొన్ని ఎపిసోడ్లతో ఒకట్రెండు వారాలు బండి నడిచింది కానీ.. ఆ తర్వాత పాత ఎపిసోడ్లతో నడిపిస్తూ వచ్చారు. ఇటీవల టీవీ షూటింగ్‌లన్నీ పున:ప్రారంభ అయిన నేపథ్యంలో ఈ షో కూడా మళ్లీ మొదలైంది.

ఒక వారం షూటింగ్ చేసి తర్వాతి వారం ఎపిసోడ్లు నడిపించారు. రెండో వారం కూడా ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ జరిగింది. ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. కానీ ఇప్పుడీ షోకు మళ్లీ బ్రేక్ పడినట్లు సమాచారం. ఇందుక్కారణం షోలో అత్యంత ఆకర్షణీయమైన హైపర్ ఆది టీంలోనే ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరన్నది వెల్లడి కాలేదు.

కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయింగా.. పాజిటివ్‌గా తేలిందని.. దీంతో మిగతా వాళ్లనూ పరీక్షలకు పంపారని.. అందరూ హోం క్వారంటైన్ అయ్యారని సమాచారం. మరింతమంది కరోనా పాజిటివ్‌గా తేలే అవకాశాలుండటం.. షోను కొనసాగిస్తే బాధితుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఈ షో్కు మళ్లీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీ సీరియల్స్ చిత్రీకరణలు కూడా చాలా వరకు ఆగిపోయాయి.

నవ్య స్వామి సహా టీవీ ఆర్టిస్టుల పలువురు ఇటీవల కరోనా బాధితులుగా తేలారు. దీంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో ఆందోళన నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాను ఆపడం సులువు కాదని తేలిపోవడంతో షూటింగ్స్ అన్నీ ఆపేయక తప్పట్లేదు. ఇక టీవీ చిత్రీకరణలకు సంబంధించిన అప్ డేట్స్ చూశాక అసలే వెనుకంజ వేస్తున్న సినిమా బృందాలు.. మరింతగా వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తుంటే ఇంకో రెండు నెలలు అన్ని కార్యకలాపాలూ ఆపుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.