‘ఆర్ఆర్ఆర్’పై అదిరిపోయే మాట చెప్పిన రైటర్

హీరో హీరోయిన్లెవరు.. టెక్నీషియన్లెవరు.. కథ ఏంటి అన్నది సంబంధం లేదు.. ఒక్క రాజమౌళి పేరు కనిపిస్తే చాలు.. ఇప్పుడు సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. దేశమంతటా ఆయనకున్న క్రేజ్ అలాంటిదే. ‘బాహుబలి’ తర్వాత తనపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు రాజమౌళి.

ఇలా తనపై అంచనాలు పెంచడం.. ఆ అంచనాలను అందుకోవడానికి మరింత కష్టపడటం.. ఎంతటి అంచనాలతో వచ్చినా సంతృప్తిపరచడం రాజమౌళికే సాధ్యమైన విద్య. ఆయన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా అంచనాలు మామూలుగా లేవు. దాన్ని ఆయన కచ్చితంగా అందుకుంటాడనే అంటున్నాడు ‘బాహుబలి’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’కు కూడా తమిళంలో మాటలు, పాటలు రాస్తున్న మదన్ కార్కీ.

ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కార్కీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన తెచ్చాడు. ‘బాహుబలి’లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్లు పది ఉన్నాయనుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో అంతకుమించిన గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నట్లుగా చెప్పి ఈ సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచేశాడు కార్కీ. ఈ చిత్రంలో దేశభక్తి అంశాన్ని చాలా బలంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా రాజమౌళి చూపించాడని… ఇందులో అందమైన విజువల్స్‌తో పాటు ఇంతకుముందు ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని చెప్పాడు మదన్.

ఇక రాజమౌళి సినిమాల్లో మాటలు ఎప్పుడూ చిన్నగా, ఎంతో తీవ్రతతో, మరెంతో ప్రభావం చూపేలా ఉంటాయని.. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నాడు మదన్. మితభాషి అయిన మదన్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఈ రేంజిలో చెప్పాడంటే జక్కన్న మరోసారి వినోదాల విందు చేయబోతున్నట్లే. కరోనా ప్రభావం లేకుంటే వచ్చే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేసేది కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చిత్రం విడుదల కావడానికి కనీసం ఏడాది పట్టేలా ఉంది.