చంద్రబాబు వ్యూహం ఫలిస్తే, ఇదో పెను సంచలనమే

2019 ఎన్నికల్లో ఓ వేవ్ వచ్చింది.. అది అనూహ్యమైన వేవ్.! ఎవరూ ఊహించనంత గొప్ప విజయం వైసీపీకి దక్కింది. నిజానికి, వైసీపీ కూడా అంతటి విజయాన్ని ఊహించి వుండదు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. అంటాం ఇలాంటి విక్టరీని.

మళ్ళీ ఇంకేదన్నా రాజకీయ పార్టీ లేదా, కొన్ని పార్టీల కూటమి అలాంటి విజయం సాధించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అంతటి వ్యతిరేకత, అధికార పార్టీ మీద వుండాలి. విపక్షాలన్నీ ఐక్యంగా వుండాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాల ఐక్యత కనిపిస్తోంది. కాంగ్రెస్ రేస్‌లో వున్నా లేనట్టే గనుక, మిగతా ప్రధాన రాజకీయ పార్టీలు (వామపక్షాలు మినహా) ఒక్కతాటిపైకి వచ్చిన దరిమిలా, 2024 ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

అత్యద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ చెబుతోంది. సంక్షేమమే తమని గెలిపించేస్తుందనే భ్రమల్లో వైసీపీ వుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. తెలంగాణలోనూ కేసీయార్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేసింది. కానీ, ఓడిపోయింది కదా.!

ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇంకా భిన్నం. వైసీపీ పాలన పట్ల జనం విసిగిపోయారన్న విషయం ఎన్నికల కోడ్ వచ్చాక మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇతర పార్టీల్లోకి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలూ దూకేశారు. టిక్కెట్లు దక్కినవాళ్ళు సైతం, వైసీపీలో వుండలేకపోతున్నారు.

ఈ పరిస్థితుల్ని రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. నిజానికి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని తొలుత విపక్ష కూటమికి బీజం వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

పవన్ వ్యూహం ఫలించింది.. బీజేపీ – టీడీపీ కలిశాయ్. కూటమి ఏర్పాటయ్యాక డ్రైవింగ్ సీట్‌లోకి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఆయనిప్పుడు కూటమికి 160 అసెంబ్లీ సీట్లు.. అని నినదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే, కూటమి అభ్యర్థుల విజయానికి వ్యూహ రచన చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహం ఫలిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెను సంచలనమే అవుతుంది.