ఆ బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్‌ భారీ చిత్రం?

Prabhas

ఇండియాలో ఇప్పుడు నిఖార్స‌యిన పాన్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ల‌లో ప్ర‌భాస్ ఒక‌డు. బాహుబ‌లితో అత‌ను సంపాదించిన ఇమేజ్‌, తెచ్చుకున్న పాపులారిటీ, విస్త‌రించిన మార్కెట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సాహో అనే డిజాస్ట‌ర్ మూవీ కూడా ఉత్త‌రాదిన హిందీలో రూ.150 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ప్ర‌భాస్ స‌త్తాను తెలియ‌జెప్పేదే.

ఈ నేప‌థ్యంలో అత‌డి నార్త్ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాల‌ని నిర్మాత‌లు చూస్తున్నారు. ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం రాధే శ్యామ్ (వ‌ర్కింగ్ టైటిల్‌)తో పాటు దాని త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమాను కూడా దేశ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డం ప‌క్కా. ఐతే ఇంత‌టితో ఆగ‌కుండా ప్ర‌భాస్‌తో పూర్తి స్థాయి హిందీ సినిమా చేయించే దిశ‌గా కీల‌క అడుగు ప‌డింది.

ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన అజ‌య్ దేవ‌గ‌ణ్ మూవీ తానాజీని రూపొందించిన ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌బోతున్న‌ట్లు తాజా స‌మాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి ప్ర‌భాస్ హోం బేన‌ర్ అన‌ద‌గ్గ యువి క్రియేష‌న్స్ నిర్మించ‌బోతోంద‌ట‌. వ‌రుస‌గా యువి వాళ్ల‌కు రెండు సినిమాలు చేశాక‌.. బ్రేక్ తీసుకుని వైజ‌యంతీ మూవీస్ బేన‌ర్లో నాగ్ అశ్విన్ సినిమా చేయ‌నున్న ప్ర‌భాస్ తిరిగి.. యువితో చేతులు క‌ల‌ప‌బోతున్నాడు.

ఐతే ఆ చిత్రంలో యువి వాళ్ల‌ది నామ‌మాత్ర‌పు భాగ‌స్వామ్య‌మే అంటున్నారు. ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ బ‌డా బేన‌ర్ భారీ స్థాయిలో నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. తానాజీ త‌ర‌హాలోనే ఓ చారిత్ర‌క క‌థ‌తో ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని అంటున్నారు.2022లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది.